- వీడ్కోలు ప్రసంగంలో జస్టిస్ సంజయ్ కరోల్
న్యూఢిల్లీ : కోర్టుకు వచ్చే ప్రతి వ్యక్తిని కేవలం పిటిషనర్గా కాకుండా ఒక మనిషిగా చూడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ అన్నారు. ఒక పిటిషన్ కేసుకు సంబంధించిన వాస్తవాలను మాత్రమే చెబుతుందని, కానీ కోర్టును ఆశ్రయించిన వ్యక్తి ఇప్పటికే ఏం కోల్పోయాడు? కోర్టు నుంచి ఏం ఆశిస్తున్నాడు? వంటి విషయాలను అది చెప్పలేదని, అందుకే న్యాయమూర్తికి వినయం అవసరమని తెలిపారు. శనివారం సుప్రీంకోర్టులో తన చివరి పని రోజున ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం, న్యాయమూర్తులు కేవలం చట్టాన్ని సరిగ్గా వర్తింపజేయాలని మాత్రమే కోరడం లేదని, చట్టాన్ని న్యాయబద్ధంగా అమలు చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. న్యాయమూర్తులు దేవుళ్లు కాదని, ప్రతి తీర్పునూ కచ్చితంగా సరైనదిగా ఇవ్వలేమన్నారు. న్యాయవ్యవస్థలో వినయం, బాధ్యత, మానవీయ కోణం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
మౌనం కూడా ముఖ్యం..
దాదాపు నాలుగు దశాబ్దాల తన న్యాయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ తొలుత న్యాయవాదిగా, ఆ తర్వాత 19 ఏళ్లపాటు న్యాయమూర్తిగా సేవలందించానని చెప్పారు. కోర్టులో వినిపించే వాదనలతో పాటు మౌనంలో దాగి ఉన్న మాటలను కూడా న్యాయమూర్తులు అర్థం చేసుకోవాలని జస్టిస్ కరోల్ అన్నారు. న్యాయ ప్రక్రియలో న్యాయవాదులు చేసే వాదనలే కాకుండా, మాటల మధ్యలో బాధితులు కోరుకునేది ఏమిటో గుర్తించడం కూడా ముఖ్యమన్నారు.








కామెంట్లు (0)