ముంబయి : మరాఠా కోటా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న ఉద్యమకార్యకర్త మనోజ్ జరాంగేను కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) అధ్యక్షుడు అభిజీత్ దీప్కే కలిశారు. ఆయన దీక్షకు దీప్కే మద్దతు ప్రకటించారు. జరాంగే చేపడుతున్న చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారానికి 14వ రోజుకి చేరుకుంది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనను తీవ్రతరం చేసి, జులైలో అప్పటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేసిన సోనమ్ వాంగ్చుక్ నిరసనను ఢిల్లీ పోలీసులు బలవంతంగా భగ్నం చేసినట్లే, జరాంగేను కూడా నిరసన స్థలం నుండి ఖాళీ చేయించగలరా అని మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఇది మహారాష్ట్ర అని, ఇక్కడ అటువంటి చర్యలను సహించరని అన్నారు. ఆయనకు ఏమైనా హాని జరిగితే మహారాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు నిరసన ప్రదేశానికి తరలివస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాటిల్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అసలు ఆయన ఆరోగ్య పరిస్తితి గురించి ఇప్పటివరకు ప్రభుత్వం ఆరా తీయలేదని అన్నారు. దేశంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని అన్నారు. ఎన్నికైన నేతలు తమను ఎన్నుకున్న ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జరాంగేతో మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఇటువంటి సామాజిక కార్యకర్తలను చనిపోయేలా వదిలివేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమా అని దీప్కే ప్రశ్నించారు. పాటిల్ తన సామాజిక వర్గానికి మెరుగైన విద్య, ఉపాధి అవకాశాల కోసం పోరాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తగిన విద్య, ఉపాధి అవకాశాలను కల్పించి ఉంటే, ఆయన నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ఏ ఒక్క జిల్లాలోనైనా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, అక్కడ తగినన్ని ఉపాధి అవకాశాలు ఉన్నాయని నిరూపించాలని దీప్కే ప్రభుత్వానికి సవాలు విసిరారు. పాటిల్తో చర్చలు జరపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
మరాఠా రిజర్వేషన్కు సంబంధించిన 15 డిమాండ్ల కోసం పాటిల్ జల్నాలోని అంతర్వాలి సారథిలో ఆగస్టు 29 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. తన డిమాండ్ల సాధన కోసం ముంబయికి పాదయాత్ర చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పాదయాత్ర తేదీని ఖరారు చేయడానికి పాటిల్ శనివారం మరాఠా సమాజ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.








కామెంట్లు (0)