అబుదాబి/ మస్కట్ : హార్ముజ్ జలసంధిలో రెండు అరబ్ చమురు ట్యాంకర్లపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించగా, మరో ఎనిమిదిమంది గాయపడ్డారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రక్షణశాఖ మంగళవారం ప్రకటించింది. వ్యూహాత్మక జలమార్గంలో ఉద్రిక్తతలు పెరిగిన అనంతరం జరిగిన తాజా ఘటన ఇది. ఇరాన్ ఈ దాడి చేసినట్లు రక్షణ శాఖ ఆరోపించింది. హార్ముజ్ జలసంధి దక్షిణ మార్గంలో, ఒమన్ ప్రాదేశిక జలాల్లో మొంబాసా, అల్ బహియా అనే ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. మొంబాసా నౌకలో సిబ్బంది మరణించారని ప్రకటించింది. గాయపడిన ఎనిమిది మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. గాయపడిన వారిలో ఆరుగురు భారతీయులు కాగా, ఇద్దరు ఉక్రెయినీలు ఉన్నారని తెలిపింది. దాడి కారణంగా రెండు ట్యాంకర్లలో మంటలు చెలరేగాయని, మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు, ఆస్తినష్టం వాటిల్లిందని రక్షణశాఖ తెలిపింది. ఇది ప్రత్యక్ష దాడిని ఖండిస్తున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. ఉద్రిక్తతలను పెంచే ఈ చర్యపై ప్రతిస్పందిస్తామని తెలిపింది.
ఒమన్లోని ఖల్హత్కు ఈశాన్యంగా 40 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న ఒక ట్యాంకర్ను గుర్తుతెలియని డ్రోన్/క్షిపణి ఢీకొట్టిందని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ (యుకెఎంటిఒ) మంగళవారం మరో ప్రకటనలో వెల్లడించింది. డ్రోన్/క్షిపణి కుడి వైపున ఉన్న ఇంజిన్ గదిని ఢీకొట్టిందని, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ట్యాంకర్ మాస్టర్ నివేదించినట్లు తెలిపింది. తాజా దాడులపై ఇరాన్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు చేయడంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వారాలుగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ జలమార్గంలో తాజా ఘటనలు చోటుచేసుకున్నాయి.








కామెంట్లు (0)