న్యూఢిల్లీ : కావేరీ జల వివాదంపై విచారణను ఈ నెల 17కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ వివాదాన్ని విచారించాల్సిన ధర్మసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ విక్రమ్ నాథ్ వైరల్ జ్వరంతో బాధపడుతుండటంతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బుధవారం వెల్లడించారు. కబిని, కృష్ణరాజ సాగర జలాశయాల నుంచి కావేరీ నీటి విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను ఈ నెల 13కు అంటే గురువారానికి సుప్రీంకోర్టు విచారణ కోసం జాబితా చేసింది. కానీ జస్టిస్ విక్రమ్ నాథ్ అందుబాటులో లేకపోవడంతో విచారణను వాయిదా వేశారు. ఈ నెల 12లోపు 15 రోజుల పాటు 3500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని జూలై 30న కేంద్ర జల నిర్వహణ అథారిటీ (సిడబ్ల్యూఎంఎ) ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ తమిళనాడు ఈ పిటిషన్ వేసింది. మెట్టూరు జలాశయంపై ఆధారపడి కావేరీ డెల్టాలోని సుమారు 14.913 లక్షల ఎకరాల (నికర విస్తీర్ణం) భూమి ఉందని, కర్ణాటక నీటిని విడుదల చేస్తేనే ఈ
ఈ జలాశయం నిండుతుందని తమిళనాడు తెలిపింది. సుమారు నలభై లక్షల మంది రైతులు, కోటి మంది వ్యవసాయ కార్మికులు తమ జీవనోపాధి కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా మెట్టూరు నీటిపైనే ఆధారపడి ఉన్నారని తన పిటిషన్లో పేర్కొంది. కావేరీ నీటిని విడుదల చేయకపోవడం వలన తమిళనాడులోని తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుతురై, తిరుచిరాపల్లి వంటి జిల్లాల రైతులు తీవ్రంగా ప్రభావితమయ్యారని తమిళనాడు పేర్కొంది.








కామెంట్లు (0)