- భారత భవితకు రూపకర్తలు విద్యార్ధులే !
- మహిళా సాధికారతపై మరింత శ్రద్ధ
- జాతినుద్ధేశించి రాష్ట్రపతి ప్రసంగం
న్యూఢిల్లీ : పరీక్షా పత్రాల లీకేజీ సమస్యలను అరికట్టేం దుకు సమగ్రంగా సంస్కరణలను ప్రభుత్వం చేపడుతోందని, తద్వారా యువత భవితవ్యాన్ని పరిరక్షిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ఆమె ప్రసంగించారు. విద్యార్థులు దేశ భవిష్యత్తుకు రూపకర్తలని పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షలను సంస్కరించడానికి, పేపర్ లీకేజీలు, అక్రమ మార్గాలు వంటి వాటిని పూర్తిగా అరికట్టేందుకు, వ్యవస్థను పారదర్శకంగా, భద్రంగా, విశ్వసనీయంగా మార్చేందుకు ప్రభుత్వం సమగ్రంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జాతీయ భద్రతకు హామీ కల్పించేందుకు ప్రభుత్వం, సమాజం సమైక్యంగా వున్నట్లే విద్యార్థుల వర్తమానాన్ని, భవిష్యత్ను పరిరక్షించడానికి ఉమ్మడి కృషి ద్వారా ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్రపతి తెలిపారు. నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల జెన్ జెడ్ యువత నేతృత్వంలో ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. యువత ఉద్యోగాలు కల్పించే సంస్కృతిని, స్వయం ఉపాధిని ఎక్కువగా ప్రేమిస్తున్నారని, యువ పారిశ్రామికవేత్తల ప్రాతినిధ్యం దేశంలో బలమైన స్టార్టప్ వ్యవస్థను సృష్టించిందని ముర్ము అన్నారు. భారతదేశ యువశక్తి ప్రతిష్టను అంతర్జాతీయంగా ఇనుమడింప చేస్తున్నా రని చెప్పారు. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అందువల్లే అంతర్జాతీయ టోర్నమెంట్లలో మన క్రీడాకారులు గణనీయమైన విజయాలు సాధించారన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో దేశ శక్తి సామర్ధ్యాలను ఆపరేషన్ సిందూర్ అనిర్వచనీయమైన రీతిలో ప్రదర్శించిందన్నారు. శత్రువులకు గట్టి హెచ్చరికలను పంపామన్నారు. నక్సల్ రహిత భారత్ను సాధించడం ప్రధాన విజయమని, వారి ప్రభావిత ప్రాంతాల్లో సర్వముఖాభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. శాంతి, చర్చలు, సహకారం, వసుధైక కుటుంబం అన్నది అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి భారతదేశ విధానంగా వుందన్నారు. నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను భారత్ విశ్వసిస్తుందని చెప్పారు. భారత్లో యువ జనాభా ఎక్కువని అన్నారు. ఇటీవల కాలంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోందని, వారి సంరక్షణ విషయంలో సమాజం అత్యంత సున్నితంగా వ్యవహరించాలన్నారు. ఆర్థిక పటిష్టత, పెద్ద ఎత్తున డిజిటల్ మౌలిక సదుపాయాలు కలిగిన, యువత, మహిళ సాధికారతతో 2047 నాటికి వికసిత్ భారత్ను నిర్మించే దిశగా దేశం సుస్థిరంగా ముందుకు సాగుతోందని అన్నారు. యుద్ధాలు, అస్థిరత, తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ప్రపంచం సతమతమవుతున్న తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి ఫలాలు పొందేలా చూడాలన్నది ప్రభుత్వ కీలక సంకల్పమని రాష్ట్రపతి పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో 25కోట్ల మందికి పైగా ప్రజలను దారిద్ర్యం నుండి బయటకు తీసుకువచ్చామన్నారు. మహిళా సాధికారత సాధించామని, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయ గ్రూపుల నుండి ఉన్నత స్థాయిలోని రక్షణ రంగం వరకు మహిళలు అడుగుపెట్టని రంగమంటూ, సాధించని విజయమంటూ లేదని చెప్పారు. కొత్తగా మూడు కోట్ల ‘లక్షాధికారులైన దీదీ’లను తయారుచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రముఖ కవి గురజాడ అప్పారావు రాసిన ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న కవితను రాష్ట్రపతి ఉదహరించారు.







కామెంట్లు (0)