రేవంత్ రెడ్డి టాప్
శత కోటీశ్వరుడు కర్ణాటక సిఎం
అత్యంత పేద సిఎం ఒమర్ అబ్దుల్లా
ఎడిఆర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : భారతదేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో 45శాతం మంది (14)పై క్రిమినల్ కేసులు నమోదై వున్నాయి. ఈ జాబితాలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాప్ పొజిషన్లో వున్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) నిర్వహించిన విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రేవంత్ రెడ్డిపై 89కేసులు నమోదుకాగా , వీటిలో 72 కేసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)లోని తీవ్రమైన సెక్షన్ల కింద నమోదయ్యాయి. ఇతర అభియోగాలు 160 వున్నాయి. ఎడిఆర్ నివేదిక సోమవారం విడుదలైంది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు గత ఎన్నికల సందర్భంగా అందచేసిన తాజా అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. రేవంత్ రెడ్డి తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వున్నారు. ఆయనపై 29 కేసులు (ఐపిసి కింద 39 తీవ్ర అభియోగాలు, 78 ఇతర అభియోగాలు) నమోదు కాగా, 19 కేసులతో (ఐపిసి కింద ఆరు తీవ్ర అభియోగాలు, 45 ఇతర అభియోగాలు) కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ మూడో స్థానంలో వున్నారు. ఇక జాబితాలో అట్టడుగు స్థానంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, సిక్కిం ముఖ్యమంత్రి పి.ఎస్.తమంగ్, ఒరిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మలు వున్నారు. వీరిలో ఒక్కో కేసు నమోదైంది. 14మంది ముఖ్యమంత్రుల్లో 11మందిపై లంచం, నేరపూరితమైన బెదిరింపులతో సహా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారంటూ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో సువేందు అధికారి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులపై నమోదైన హత్యా యత్నం కేసులు కూడా వున్నాయి. తమిళనాడు సిఎం సి.జోసెఫ్ విజయ్, ఒరిస్సా, రాజస్థాన్ సిఎంలు మాఝి, శర్మ మాత్రం వీరందరికీ మినహాయింపుగా వున్నారు. వీరిపై ఎలాంటి తీవ్రమైన అభియోగాలు నమోదు కాలేదు. వీరిలో విజయ్, శర్మలు మొదటిసారి ఎంఎల్ఎలుగా ఎన్నిక కాగా, మాఝి నాలుగుసార్లు ఒరిస్సా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
22 రాష్ట్రాల్లో ఎన్డిఎ పాలిస్తుండగా కేవలం సువేందు అధికారి మాత్రం ఐదుగురితో కూడిన క్రిమినల్ ముఖ్యమంత్రుల జాబితాలో టాప్లో వున్నారు. మిగిలిన నలుగురు రేవంత్ రెడ్డి, శివకుమార్, సతీశన్ కాంగ్రెస్కు చెందినవారు. కాగా సోరెన్ మాత్రం కాంగ్రెస్ మిత్రపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం)కు చెందినవారు. ఈ ముఖ్యమంత్రులపై పైన పేర్కొన్న కేసులన్నీ విచారణ పెండింగ్లో వున్నాయి.
మోదటి స్ధానంలో శివ కుమార్, రెండవ శత కోటీశ్వరుడు చంద్రబాబునాయడు
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి ఎవరంటే డి.కె.శివకుమార్. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.1413 కోట్ల పైమాటే. ఆ తర్వాత స్థానంలో చంద్రబాబునాయడు వున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.931 కోట్లు. ఆ జాబితాలో విజయ్ (రూ.648కోట్లు), పెమా ఖండూ (రూ.332కోట్లు) వున్నారు. అత్యంత తక్కువగా ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల్లో జమ్మూ కాశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా (రూ.55లక్షలు), సువేందు అధికారి (రూ.85లక్షలు), భజన్ లాల్ శర్మ (రూ.కోటి)
ఈ ముఖ్యమంత్రులు ప్రకటించిన, పేర్కొన్న అత్యంత సాధారణ వృత్తులు సామాజిక, రాజకీయ సేవ, వ్యవసాయం, ప్రజా ప్రతినిధిగా వేతనం. వీరికి మినహాయింపులు కేరళ సిఎం, ఢిల్లీ సిఎంలు న్యాయవాదులు కాగా, త్రిపుర, గోవా సిఎంలు డాక్టర్లు. కాగా తమిళ సినీ రంగంలో సూపర్ స్టార్డమ్ను సాధించిన విజయ్ మాత్రం తన వృత్తిని ప్రాపర్టీ ఓనర్గా, ట్రస్టీగా ప్రకటించారు. భారతదేశంలో ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా రేఖా శర్మ ఒక్కరే వున్నారు. దీంతో లింగ వివక్ష 3శాతంగా వుంది. మొత్తంగా దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 4123 మంది ప్రతినిధులకు గానూ 390మంది మహిళా ఎంఎల్ఎలు (9శాతం) వున్నారని ఎడిఆర్ నివేదిక పేర్కొంది. ఇక వయస్సుల వారీగా చూసినట్లైతే వృద్ధులైన సిఎంల జాబితాలో ఆంధ్రా సిఎం చంద్రబాబు నాయుడు (74)తో పాటు పుదుచ్చేరి, మిజోరాం, నాగాలాండ్ సిఎంలు వుండగా, పిన్న వయస్కులైన వారిలో మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ సిఎంలు (44) వున్నారు. విద్యార్హతలను చూసినట్లైతే 84శాతం మంది డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్లు కాగా, ఇద్దరు మాత్రమే టెంత్ పాసయిన వారు. వారే చత్తీస్ఘడ్, మణిపూర్ సిఎంలు. ఇక 12వ తరగతి పాసైన వారిలో విజయ్, సోరెన్, భగవంత్ మాన్లు వున్నారు. ముగ్గురు సిఎంలకు డాక్టరేట్ డిగ్రీలున్నాయి.







కామెంట్లు (0)