- అభ్యర్థుల ఆందోళన
ఛత్రపతి సంభాజీనగర్: బాంబే హైకోర్టు క్లర్క్ నియామకానికి నిర్వహించిన ఆన్లైన్ టైపింగ్ పరీక్షలో సర్వర్, కంప్యూటర్ సమస్యలు తలెత్తాయంటూ అభ్యర్థులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే పాల్గొని మద్దతు తెలిపారు. కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్లు పనిచేయకపోవడం, కీబోర్డులు, మౌస్ స్పందించకపోవడం, స్క్రీన్లు సరిగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయని అభ్యర్థులు ఆరోపించారు. దీంతో కొందరు పరీక్ష మధ్యలోనే లాగ్అవుట్ అయ్యారని తెలిపారు. సమస్యలపై స్పందించిన బాంబే హైకోర్టు రిజిస్ట్రార్ (పర్సనల్) పరీక్ష మొత్తం సజావుగానే జరిగిందని, అయితే ఔరంగాబాద్, కల్యాణ్ తదితర కేంద్రాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు నమోదయ్యాయని తెలిపారు. వాటిని పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలపై అధికారికంగా అభ్యర్థులకు సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. సాంకేతిక లోపాలతో పరీక్ష రాయలేకపోయిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని దీప్కే డిమాండ్ చేశారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే రీ-ఎగ్జామ్పై లిఖితపూర్వక ప్రకటన ఇవ్వాలని కోరారు. హైకోర్టు నాగ్పూర్, ఔరంగాబాద్ బెంచ్ల పరిధిలోని 1,300 పోస్టుల కోసం మూడు విడతలలో నిర్వహించిన ఈ పరీక్షకు మహారాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,000 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.







కామెంట్లు (0)