ఇద్దరు ఉగ్రవాదులు మృతి
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలోని బ్రెట్టల్ సోహన్, ఖుబ్బన్ అటవీ ప్రాంతాల్లో భద్రతాబలగాలకు, సాయుధులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. వీరిని పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్కు చెందినవారిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో సామాజిక మాధ్యమాల్లో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 16న బుధవారం నాడు బ్రాటెల్ సోన్, ఖుబ్బన్ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లుగా సమాచారం అందడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. వైట్ నైట్ కార్ప్స్, జమ్మూకాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి సాయుధులున్నట్లు భావిస్తున్న నిర్దిష్ట ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టారు. ఆపరేషన్ మొదలైన కాసేపటికే భద్రతాబలగాలు కాల్పులు జరిపాయి. గురువారం ఉదయం భద్రతా వలయాన్ని తప్పించుకునేందుకు ఉగ్రవాదులు కూడా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరువురి మధ్య భీకరంగా కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. అదనపు బలగాలతో అటవీ ప్రాంతాన్ని నలువైపులా దిగ్బంధించినట్లు తెలిపారు. ఇటీవల దక్షిణ కాశ్మీర్లోని సైద్పొరా ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా (ఎల్ఇటి) ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే.







కామెంట్లు (0)