రేపటినుంచి 20వ ఆసియా గేమ్స్ ప్రారంభం
క్రికెట్లో నేడు జపాన్తో భారత మహిళల ఢీ
నగోయా(జపాన్): ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా సంబరం 20వ ఆసియా క్రీడలు 2026 శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఆసియా క్రీడల్లో భారత్ అత్యధిక పతకాలే లక్షంగా బరిలోకి దిగుతోంది. 2022లో చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన 19వ ఆసియా క్రీడల్లో భారత్ 106 పతకాలతో టాప్-4లో నిలిచింది. ఇందులో 28స్వర్ణ, 38రజత, 40కాంస్య పతకాలు ఉన్నాయి. ఆ క్రీడల్లో భారత్ తరఫున మొత్తం 661మంది అథ్లెట్లు పతకాలకోసం పోటీపడగా.. ఈసారి భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) 37క్రీడాంశాలకు సంబంధించి కేవలం 508మంది అథ్లెట్లు మాత్రమే పంపింది. ఆసియా క్రీడల్లో ఈసారి క్రికెట్కు చోటు లభించడంతో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్కు పతకం ఖాయం. అధికారికంగా సెప్టెంబర్ 19నుంచి 20వ ఆసియా క్రీడలు ప్రారంభం కానుండగా.. రెండ్రోజుల ముందే క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. భారత పురుషుల, మహిళల జట్లకు ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా క్వార్టర్ఫైనల్కు చేరగా.. శుక్రవారం జరిగిన మహిళల క్రికెట్ క్వార్టర్ఫైనల్లో భారత జట్టు ఆతిథ్య జపాన్తో తలపడనుంది. ఈసారి భారత్కు పతకాలు దక్కే క్రీడల్లో క్రికెట్ అగ్రభాగంలో ఉండగా.. బ్యాడ్మింటన్, హాకీ, అథ్లెటిక్స్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్లో అత్యధిక పతకాలు దక్కే ఛాన్స్ ఉంది. మీరాబాయి చాను ఈసారి కూడా స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇక టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, టెన్నిస్, స్విమ్మింగ్లో చైనాతోపాటు ఆతిథ్య జపాన్ నుంచి భారత్కు గట్టిపోటీ ఎదురుకానుంది.
క్రికెట్ సెమీస్కు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మహిళలు
ఆసియా గేమ్స్ మహిళల క్రికెట్ సెమీఫైనల్లోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ప్రవేశించాయి. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో పాకిస్తాన్ మహిళలు 3వికెట్ల తేడాతో థాయ్లాండ్ మహిళలపై విజయం సాధించగా.. చైనాతో జరగాల్సిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో బంగ్లా జట్టుకు సెమీస్ బెర్త్ దక్కింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో థాయ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 10.4 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది.








కామెంట్లు (0)