పాఠశాలలో మౌలిక వసతుల కోసం చిన్నారుల డిమాండ్
బాబా సాహెబ్ *చిత్రపటాలతో నిరసన
ఫతేపూర్: రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ‘జన్ జి’ నడిపిన ఉద్యమ ప్రకంపనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉన్నాయి. తాజాగా బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ ఏలుబడిలోని ఉత్తర ప్రదేశ్లో జెన్ ఆల్ఫా విద్యార్ధులు రోడెక్కారు. తమ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించాలని మంగళవారం నిరసన తెలిపారు. ఇది నెట్టింట వైరల్ అయింది. భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ చిన్నారుల పోరాట స్పూర్తిని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా కిషన్పూర్ పట్టణంలోని సర్వోదయ పాఠశాలలో వందలాది మంది చిన్నారులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పాఠశాల గేటు వద్ద వందలాది మంది విద్యార్థులు బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలను చేతబూని, విద్య, ప్రాథమిక సదుపాయాల కోసం డిమాండ్ చేస్తూ ‘జెన్-ఆల్ఫా’ తరానికి చెందిన ఈ చిన్నారులు వీధుల్లోకి వచ్చారు. పాఠశాలలో పరిశుభ్రత అస్తవ్యస్తంగా ఉందని విద్యార్థులు తెలిపారు. బెంచీలు, డెస్కులు విరిగిపోయి ఉన్నాయని, తాగునీటికి సరైన ఏర్పాటు లేదని, మరుగుదొడ్ల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉందని వారు వాపోయారు. ఈ సమస్యలపై పాఠశాల యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని పలువురు విద్యార్థులు విమర్శించారు.
అయితే నిరసన చేపట్టిన కొద్ది గంటల్లోనే పాఠశాల యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. మరుసటి రోజులోగా ప్రతి తరగతి గదిలో నాలుగు ఫ్యాన్లు ఏర్పాటు, విద్యుత్ వైరింగ్ను తక్షణమే మరమ్మతు చేయడం, ఒక నెలలోగా కొత్త డెస్కులు, బెంచీలు అందించడం, శుభ్రమైన తాగునీటి కోసం ఆర్వో వాటర్ కూలర్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడతామని స్కూల్ యాజమాన్యం రాతపూర్వకంగా హామి ఇచ్చింది. దీంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు. అయితే యోగీ సర్కార్ ప్రభుత్వ విద్యపై నిర్లక్ష్యం వహిస్తుందని, అందుకే విద్యార్థులు రోడెక్కుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.








కామెంట్లు (0)