న్యూఢిల్లీ: "నాకు మంచి భవిష్యత్తు కావాలి" అంటూ 13 ఏళ్ల ఉమాస జాతీయ జెండాతో జంతర్ మంతర్లో జరుగుతున్న సీజేపీ నిరసనలో పాల్గొంది. తన తండ్రి సలీం, స్నేహితురాలు రహేజాతో కలిసి దర్యాగంజ్ నుంచి వచ్చిన ఆమె, ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆందోళనలో పాల్గొంటున్నట్లు తెలిపింది. నిరసనలో పాల్గొన్న ఆశిష్ అనే యువతి, ప్రశ్నపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం స్వయంగా విని, వారితో చర్చలు జరపాలని కోరింది.
"మేము కేవలం మా కోసం కాదు.. దేశంలోని విద్యార్థులందరి భవిష్యత్తు కోసం ఇక్కడ నిలబడ్డాం. మా ఆందోళనను వ్యతిరేకించే వారి పిల్లల కోసం కూడా పోరాడుతున్నాం" అని ఆశిష్ పేర్కొంది. నిరసనకారుడు ఫరాజ్ మాట్లాడుతూ.. కొన్ని ఆలోచనలు, ఉద్యమాలు వ్యక్తుల కంటే గొప్పవని అన్నారు. తాను పాఠ్యపుస్తకాలు, సినిమాల్లో చూసిన భారతదేశపు ఆదర్శాల కోసమే ఈ ఉద్యమంలో పాల్గొంటున్నానని చెప్పారు. నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరు అకారణమని, తాను చూసిన అత్యంత దారుణమైన ఘటనల్లో ఇదొకటని వ్యాఖ్యానించారు. అధికారంలో ఎవరున్నా ప్రజలతో ఇలాంటి వైఖరి ఉండకూడదని మరో యువకుడు అభిప్రాయపడ్డాడు. ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది.







కామెంట్లు (0)