జెపి నడ్డాకు రాసిన లేఖలో ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలోని రాంలీలా మైదాన్లో తాను బహిరంగ సభలో పాల్గొన్న ప్రదేశాన్ని శుద్ధి చేసిన దారుణ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజ్యసభలో పాలకపక్ష నేత జెపి నడ్డాకు లేఖ రాశారు. ఈ విషయమై తనకు ఇచ్చిన హామీని కూడా ఖర్గే ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 24 రోజులు గడిచినా బాధ్యులపై, సంబంధిత సంస్థలపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని అన్నారు. ఈ అంశం వ్యక్తిగతంగా తనకు లేదా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పరిమితమైనది కాదని, ప్రతి నిత్యం కోట్లాది మంది ప్రజలు ఎదుర్కొనే వివక్షతకు సంబంధించిన అంశంతో ముడిపడి వుందని పేర్కొన్నారు. అటువంటి తప్పుడు పనులకు పాల్పడేవారికి కచ్చితంగా ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుందని ఆయన స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 8న హల్ద్వానీలోని రాంలీలా గ్రౌండ్లో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. ఆ తర్వాత సంఘ్ పరివార్కు చెందిన దుండగులు ఆ వేదిక వద్ద శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంతో వివాదం మొదలైంది. ఖర్గే దళితుడైనందునే ఇలా చేశారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ శుద్ధీకరణ చర్యలు అంటరానితనానికి మరో పేరని రాహుల్ గాంధీ విమర్శించారు.







కామెంట్లు (0)