న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు పూర్తిగా దిగజారింది. ఒక్క నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 8.8శాతం నుండి 6.7శాతానికి పడిపోయింది. కార్పోరేట్లకు అనుగుణంగా ఎన్డిఎ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామిక విధానాలు దేశాన్ని తిరోగమనం వైపు తీసుకువెళుతున్నాయి. తయారీ రంగంలో వృద్ధి రేటు కూడా 9.5 శాతం నుండి 7.3శాతానికి క్షీణించింది.
పారిశ్రామిక వృద్ధి రేటు మందగించడానికి ప్రధాన కారణం మైనింగ్ రంగంలో ఎదురైన ఎదురుదెబ్బ ప్రధాన కారణం. మైనింగ్, క్వారీయింగ్ సెక్టార్లో జూన్లో 1.6 వృద్ధి రేటు నమోదు కాగా, జులై నాటికి భిన్నంగా 0.9శాతానికి పడిపోయింది. విద్యుత్, గ్యాస్ సరఫరా రంగంలో కూడా భారీ క్షీణత నమోదైంది. ఈ రంగంలో వృద్ధి రేటు 11.3శాతం నుండి 8.7శాతానికి దిగజారింది. మెడిసిన్ ఉత్పత్తి రంగం 5.6శాతానికి పడిపోగా, కెమికల్ ఉత్పత్తి కూడా 2.7శాతానికి పడిపోయింది.
పారిశ్రామిక వృద్ధి రేటులో క్షీణత భవిష్యత్తులో దేశం ఎదుర్కోనున్న కీలక సవాళ్లకు ప్రధాన సూచిక అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతకొన్నేళ్లుగా మోడీ ప్రభుతవం చేపడుతున్న తప్పుడు విధానాలకు ప్రస్తుత సంక్షోభం అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, మద్యతరహా పరిశ్రమల బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టడానికి బదులుగా బిజెపి ప్రభుత్వం కార్పోరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు కూడా ఈ సంక్షోభాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికే ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు, పారిశ్రామిక రంగంలో క్షీణత కూడా ప్రధాన అవరోధం కానుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్లు (0)