- జస్టిస్ నాగరత్నతో సహా ముగ్గురు న్యాయమూర్తులు
న్యూఢిల్లీ : కార్మికులకు అనుకూలంగా 1978 నాటి ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని పునర్ నిర్వచిస్తూ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు పట్ల అదే ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న సహా ముగ్గురు న్యాయమూర్తులు అసమ్మతి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో 1978 నాటి ‘పరిశ్రమ’ నిర్వచనం అవసరం ఎంతో ఉందని నొక్కి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ నానాటికి ప్రైవేటీకరణ చెందుతున్న నేపథ్యంలో కార్మికుల హక్కులను పరిరక్షించడమనేది అత్యధిక ప్రాధాన్యత గల అంశంగా వున్నందున ‘పరిశ్రమ’కు విస్తృత నిర్వచనం వుండాలని ఆమె నొక్కి చెప్పారు.
జస్టిస్ నాగరత్న విడిగా పేర్కొన్న అభిప్రాయాన్ని జస్టిస్ దీపంకర్ దత్తా సమర్ధించారు. దత్తా తను రాసిన స్వతంత్ర అభిప్రాయాన్ని జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో పంచుకున్నారు. 1978నాటి తీర్పును ఇప్పడు పరిశీలించడం పూర్తిగా అనవసరమని ఆమె స్పష్టం చేశారు. పైగా విచారణకు ఆమోద యోగ్యం కూడా కాదని అన్నారు. పరిశ్రమ సమగ్ర నిర్వచనాన్ని అలాగే కొనసాగించడం గతంలో కంటే ఇప్పడు మరింత ముఖ్యమని నాగరత్న పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థలకు యాజమాన్యం బదిలీ అవుతున్న తరుణంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు ప్రైవేటు రంగ సంస్థ ఉద్యోగులు, కార్మికులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో, పారిశ్రామిక వివాదాల చట్టం కింద రక్షణ కల్పించబడింది. దాదాపు 50ఏళ్లుగా 2(జె) కింద ధృఢంగా నిలిచిన పరిశ్రమ నిర్వచనానికి ఏదైనా మార్పు చేసిన పక్షంలో ఐఆర్సి కింద ఆ పదానికి చేసే భాష్యంపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని జస్టిస్ నాగరత్న హెచ్చరించారు. జోక్యం చేసుకోవడం వల్ల అనిశ్చితి సృష్టించబడుతుంది, ‘పారిశ్రామిక శాంతి’ కల్లోలమవుతుందని పేర్కొన్నారు. ఒక కార్యకలాపంలో ప్రభుత్వ ప్రమేయం వున్నంత మాత్రాన అది ఆటోమేటిక్గా సార్వభౌమాధికార కార్యకలాపంగా పరిగణించబడదని జస్టిస్ నాగరత్న అన్నారు. బహుముఖంగా లేదా సమగ్రంగా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు సంబంధించి 1978నాటి తీర్పులో ప్రవేశపెట్టిన ‘డామినెంట్ నేచర్ టెస్ట్’ను ఆమె సమర్ధించారు. అటువంటి కేసుల్లో ఆ సంస్థ పరిశ్రమా కాదా అనేది నిర్ణయించడానికి ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యకలాపం స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.







కామెంట్లు (0)