పాల మున్సిపల్ ఛైర్మన్పై ఎల్డిఎఫ్ అవిశ్వాస తీర్మానానికి ఆమోదం
తిరువతనంతపురం : కేరళలో అధికార యుడిఎఫ్కు ఒక ఎదురుదెబ్బ తగిలింది. రాష్ర్టంలోని పాల మున్సిపాలిటీలో యుడిఎఫ్ మద్దతుతో కొనసాగుతున్న ఛైర్పర్సన్ దియా పులిక్కక్కండంపై ఎల్డిఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి 17 మంది కౌన్సిలర్ల మద్దతు లభించింది. మున్సిపాలిటీలో పరిపాలనా స్తబ్దతను నివారించడం, అభివృద్ధి ప్రాజెక్టులను సక్రమంగా అమలు చేయడం.. వంటి ప్రజా ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎల్డిఎఫ్ పేర్కొంది. తీర్మానం సందర్భంగా కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్, కెడిపి కౌన్సిలర్లు సభా కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యుడిఎఫ్ విప్ జారీ చేసింది. అయితే, కాంగ్రెస్ కౌన్సిలర్లు లిసికుట్టి మాథ్యూ, బిజు మాథ్యూస్, టోనీ తైపరంబిల్, రాజిత ప్రకాష్ ఈ విప్ను ధిక్కరించి చర్చలో పాల్గొన్నారు. కాంగ్రెస్ రెబెల్గా పోటీ చేసిన వైస్ ఛైర్పర్సన్ మాయా రాహుల్ కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. మొత్తంగా 26 మంది సభ్యులున్న మున్సిపల్ కౌన్సిల్లో ఎల్డిఎఫ్కు 12 మంది, యుడిఎఫ్కు 10 మంది, నలుగురు స్వతంత్రులు ఉన్నారు. ఎల్డిఎఫ్కు ఆధిక్యం ఉన్నా స్వతంత్రులతో కలిసి యుడిఎఫ్ కూటమి ఛైర్పర్సన్ పదవిని దక్కించుకుంది. అయితే తరువాత ఈ కూటమిలో వివాదాలు తలెత్తాయి.








కామెంట్లు (0)