పిఎస్బి కాన్క్లేవ్లో మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన కోసం బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు చేపడతామని, త్వరలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకింగ్ రంగాన్ని సమగ్రంగా సమీక్షించి, తదుపరి దశ ఆర్థిక వృద్ధికి అవసరమైన సంస్కరణలను ఈ కమిటీ సూచిస్తుందని చెప్పారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న పిఎస్బి కాన్క్లేవ్ 2026లో సోమవారం మంత్రి మాట్లాడుతూ.. యువత బ్యాంకింగ్ అవసరాలు, వారిలో విభిన్న తరగతులకు అందించాల్సిన ఆర్థిక సేవలను బ్యాంకులు తమ వ్యూహాల్లో ప్రధానంగా పరిగణించాలని సూచించారు. ఇప్పటికే సిద్ధం చేసిన అధ్యయన పత్రాలను పరిశీలించి ఆచరణ సాధ్యమైన సూచనలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. రెండు రోజుల పిఎస్బి కాన్క్లేవ్లో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఏడు కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. డిపాజిట్ల సమీకరణ, యువతకు బ్యాంకింగ్ సేవలు, పెట్టుబడుల సమీకరణకు మద్దతు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జిసిసి)కు సహకారం, వ్యవసాయ ఉద్యానవన విలువ గొలుసు మౌలిక వసతులకు రుణాలు, క్రెడిట్ కార్డు వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించడం, ప్రాధాన్య రంగ రుణాలు ఇందులో ఉన్నాయి.








కామెంట్లు (0)