న్యూఢిల్లీ : భారత నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత ప్రభుత్వం పాకిస్తాన్ దౌత్యవేత్తకు బుధవారం నోటీసులిచ్చింది. ఇది ‘‘ఆమోదయోగ్యం కాని’’,‘‘ అనైతికమైన చర్య’’ గా భారత విదేశాంగ శాఖ (ఎంఇఎ) అభివర్ణించింది. అరేబియా సముద్రంలో సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత యుద్ధ నౌకను మంగళవారం పాక్ నౌక ఢీకొట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నౌక నిబంధనకు విరుద్ధంగా అధికవేగంగా నౌకను నడపడం వలనే ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదు. అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ఘటన కారణంగా పెద్దగా నష్టం వాటిల్లకపోయినప్పటికీ, పాకిస్తాన్ నౌకాదళ ప్రవర్తన 1991 ఏప్రిల్ నాటి సైనిక విన్యాసాలు, దళాల కదలికలపై ముందస్తు నోటీసుకు సంబంధించి భారత పాకిస్తాన్ల మధ్య కుదిరిన ఒప్పందంలోని ఆర్టికల్ 10కి పూర్తి విరుద్ధంగా ఉంది అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి, అన్ని సైనిక విభాగాలు తగిన జాగ్రత్తలు పాటించాలని, ఇరుపక్షాల మధ్య ఉన్న ఒప్పందాలను గౌరవించాలని పాక్ ప్రభుత్వానికి తెలియజేయాలని పాకిస్తాన్ తాత్కాలిక దౌత్య ప్రతినిధికి సూచించినట్లు పేర్కొంది. అలాగే ఇస్లామాబాద్లోని భారత తాత్కాలిక రాయబారిని పాకిస్థాన్ విదేశాంగ శాఖ వద్ద ఇదే తరహా నిరసనను వ్యక్తం చేయాల్సిందిగా ఆదేశించారు.
పాకిస్తాన్ దౌత్యవేత్తకు నోటీసులిచ్చిన భారత ప్రభుత్వం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 02:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)