- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ముంబయి : ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అయితే ప్రస్తుతం విశ్వసనీయత సంక్షోభం మీడియా రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా మారిందని ఆయన అన్నారు. అన్ని రంగాల్లోనూ విశ్వసనీయత తగ్గుతున్నప్పటికీ, మీడియా రంగంలోనే ఈ సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తోందని తెలిపారు. నాగ్పూర్లో జరిగిన ఐఐఎం నాగ్పూర్ మీడియా కాన్క్లేవ్ 2026లో 'మీడియా, లీడర్షిప్ అండ్ ది న్యూ వరల్డ్ ఆర్డర్' అనే థీమ్తో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గడ్కరీ ప్రసంగించారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలైన శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ, మీడియా తమ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించాలన్నారు. ప్రజాస్వామ్యం పురోగతికి, అభివృద్ధికి స్వతంత్ర, నిష్పక్షపాత న్యాయవ్యవస్థతో పాటు స్వతంత్ర మీడియా కూడా అవసరమని అప్పుడే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పిటిఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎడిటర్ ఇన్ చీఫ్ విజయ్ జోషి, బిజినెస్ స్టాండర్డ్ ఎడిటోరియల్ డైరెక్టర్ ఎకె భట్టాచార్య, బ్లిట్జ్ ఇండియా మీడియా గ్రూప్ ఛైర్మన్, ఎడిటర్ ఇన్ చీఫ్ దీపక్ ద్వివేది తదితరులు హాజరయ్యారు.







కామెంట్లు (0)