మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా పరస్పర సమన్వయం, సహకారం

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 11:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలి

  • మూడు కమ్యూనిస్ట్ పార్టీల సంయుక్త సమావేశంలో నిర్ణ‌యం

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా పరస్పర సమన్వయం, సహకారం బ‌లోపేతం చేసుకోవాల‌ని మూడు క‌మ్యూనిస్టు పార్టీలు నిర్ణ‌యించాయి. దేశంలోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) నాయకులు మంగ‌ళ‌వారం నాడిక్క‌డ సిపిఐ(ఎంఎల్) కేంద్ర కార్యాలయం (చారు భవన్‌)లో సంయుక్త సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో సిపిఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.ఎ. బేబీ, పొలిట్ బ్యూరో స‌భ్యులు ఆర్‌. అరుణ్ కుమార్, సిపిఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డి. రాజా, జాతీయ కార్య‌ద‌ర్శులు రామకృష్ణ పాండా, గిరీష్, సిపిఐ(ఎంఎల్) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దీపాంకర్ భట్టాచార్య, నేత‌లు రవిరాయ్, సంజయ్ శర్మ, సుచేతా దే, శ్వేతా రాజ్, ప్రభాత్ చౌదరి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చారు మజుందార్ 54వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్ర‌హానికి నివాళులర్పించారు. అనంతరం మూడు పార్టీలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ‘‘చారిత్రాత్మక జంతర్ మంతర్ నిరసనలతో యువజన ఉద్యమం సాధించిన గణనీయమైన విజయాన్ని మూడు కమ్యూనిస్ట్ పార్టీలు స్వాగతించాయి. పోలీసుల అణచివేతను ధైర్యంగా ఎదుర్కొని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు, సిజెపికి చెందిన విద్యార్థి-యువజన కార్యకర్తలను వారి ధైర్యం, సృజనాత్మకత, పట్టుదలకు అభినందించాయి. అన్నిచోట్లా ఉన్న బిజెపి ప్రభుత్వాలు జంతర్ మంతర్ ఒప్పందాన్ని గౌరవించేలా చూడాలి. విద్యార్థి-యువజన ఉద్యమ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులను ఆపాలి. విద్యా, పరీక్షా విధానంలో సమర్థవంతమైన సంస్కరణలు సాధించడానికి, సురక్షితమైన, గౌరవప్రదమైన ఉపాధి హక్కులను పొందడానికి జంతర్ మంతర్ ప్రతిఘటన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాయి. ‘‘సామ్రాజ్యవాద దాడులు, కార్పొరేట్ దోపిడీల నుండి ప్రజల ప్రయోజనాలను కాపాడటం, శ్రామిక ప్రజలకు ఆర్థిక ఉపశమనం కల్పించడం, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయడం, వంటి తక్షణ అజెండాలపై కార్మిక సంఘాలు, రైతులు, గ్రామీణ కార్మికులు, మహిళా సంఘాల మధ్య మరింత సన్నిహిత సమన్వయాన్ని పెంపొందించుకోవడానికి ఈ మూడు పార్టీలు అంగీకరించాయి. సంఘ్ సభ్యులు, బిజెపి నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా పరస్పర సమన్వయం, సహకారాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని పార్టీలు నొక్కిచెప్పాయి’’ అని ప్రకటనలో పేర్కొన్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్