- స్కూల్ నుండి బయటకు పంపేసిన ఉపాధ్యాయురాలు
- ఎనిమిదో తరగతి విద్యార్థి ఆవేదన
- సెల్పీ వీడియో వైరల్
లక్నో : దేశంలో ఏ దిక్కున చూసినా కుల జాడ్యం బుసలుకొడుతూనే ఉంది. వివక్ష, అంటరానితనం కొనసాగుతూ విద్యావ్వవస్థను సైతం కబలిస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లా నఖాహా బ్లాక్లోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల పత్రాసిలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిపై ఉపాధ్యాయురాలు కుల వివక్షతను చూపింది. విద్యాబుద్ధులు నేర్పించి, అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన గురువు దిగజారి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఏం జరిగిందంటే?
కృష్ణ అనే విద్యార్థి వాల్మీకి సామాజికవర్గానికి (షెడ్యూల్డ్ కులం) చెందినవారు. తనను తరగతిలో కూర్చోబెట్టకుండా, తనకు పాఠాలు బోధించకుండా, తన నుంచి దూరంగా ఉండాలని ఉపాధ్యాయురాలు పదే పదే హెచ్చరించారని ఆ విద్యార్థి సెల్పీ వీడియోలో తెలిపాడు. కృష్ణ తరగతికి వస్తే తాను పాఠశాలలో ఉండనని ఆమె చెప్పిందని విద్యార్ధి తెలిపాడు. ఇందుకు తాను చెసిన ఏకైక తప్పు వెనకబడిన సామాజికవర్గంలో పుట్టడమేనని, ఈ ప్రవర్తన తన చదువుపై, ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆ బాలుడు వాపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, భాద్యులపై ఎస్సి, ఎస్టి చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే, ఈ ఘటనపై బిజెపి ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందింకపోవడం గమనార్హం.







కామెంట్లు (0)