- ఖేలో ఇండియా, జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ.36,441 కోట్లు
- కేంద్ర మంత్రి వర్గం ఆమోదం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) పథకాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం నాడిక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. రైతులకు సంబంధించిన పిఎం కిసాన్ పథకాన్ని ఐదేళ్లు పొడిగించాలని, రూ. 3,15,614 కోట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఏడాదికి రైతుకు రూ.6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని, ఇప్పటి వరకు 23 వాయిదాల్లో రూ.4.47 లక్షల కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశామని తెలిపారు. ఇటీవలి 23వ విడత కింద రూ.9.49 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.18,984 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. రూ.1,25,595 కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (పిఎం-ఎస్ఎస్వై)కు రూ.5,070 కోట్లు కేటాయించామని అన్నారు. ఈ పథకం కింద డ్యామ్లు, సరస్సులపై ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి 5000 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని అన్నారు. సముద్రం అడుగున దాగున్న ముడిచమురు, సహజవాయువు వనరుల గుర్తింపు కోసం కేంద్రం ప్రారంభించిన ‘సముద్ర మంథన్’ పథకానికి రూ.84,084 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. 2030-31 వరకూ ఈ మొత్తాన్ని వినియోగించను న్నట్లు పేర్కొన్నారు. ఖేలో ఇండియా పథకానికి, జాతీయ క్రీడా సమాఖ్య (ఎఎన్ఎస్ఎఫ్)లకు ఆర్థిక సాయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీనికి సంబంధించి కేంద్రం రాబోయే ఐదేళ్ల కాలానికి రూ.36,441 కోట్లు కేటాయించిందని తెలిపారు.








కామెంట్లు (0)