ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పేపర్ లీక్కు నిరసనగా విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు జరిపిన దారుణ దాడిపై హోం మంత్రి అమిత్ షా వివరణ కోరుతూ మంగళవారం ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో ఆందోళన చేపట్టాయి. రాజ్యసభ పూర్తిగా స్తంభించిపోయింది. లోక్సభ కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. పరీక్షలలో అవకతవకలను నిరోధించే సవరణ బిల్లుపై చర్చలో ప్రతిపక్షాలు సహకరించడంతోనే మధ్యాహ్నం 2 గంటల తరువాత లోక్సభ కార్యకలాపాలకు అంతరాయం కలగలేదు. ప్రతిపక్ష ఎంపిలు పార్లమెంటు ఆవరణంలో ఆందోళన చేపట్టారు. సభ నిరంతరం స్తంభించిపోయినప్పటికీ, ఈ విషయంపై స్పందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గానీ, హోం మంత్రి అమిత్ షా గానీ సిద్ధంగా లేరు. మంగళవారం పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్డిఎ సమావేశానికి మోడీ హాజరైనా, అందులో ప్రసంగించలేదు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటి నుంచి మోడీ, షా పార్లమెంటు ఉభయ సభలకు దూరంగా ఉన్నారు. పరీక్షలలో అవకతవకలను నిరోధించే ముఖ్యమైన బిల్లును లోక్సభ పరిశీలిస్తున్నప్పుడు కూడా, ప్రధానమంత్రి గానీ, హోం మంత్రి గానీ సభకు రావడానికి సిద్ధపడలేదు. ఉదయం లోక్సభ, రాజ్యసభలు సమావేశమైన వెంటనే, విద్యార్థులు, యువతపై పోలీసుల అఘాయిత్యాల అంశాన్ని ప్రతిపక్ష ఎంపిలు లేవనెత్తి నిరసన తెలిపారు. లోక్సభ, రాజ్యసభల కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పటికీ, ప్రతిపక్షాల నిరసనలు ఏమాత్రం తగ్గలేదు. ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్న సమయంలోనే, మంత్రి జీతన్ రామ్ మాంఝీ చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభను గురువారం సమావేశానికి వాయిదా వేశారు.
Print Editionప్రతిపక్షాల ఆందోళనతో స్తంభించిన రాజ్యసభ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 11:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)