ఎంఎ బేబీ సంతాపం
న్యూఢిల్లీ : ప్రఖ్యాత పాలస్తీనా చిత్రకారుడు, శిల్పి, రచయిత, కార్టూనిస్ట్ అయిన స్లిమన్ మన్సూర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 79సంవత్సరాలు. ప్రాచీన సాంప్రదాయాలను ఆధునిక ప్రతిఘటనా రూపాలతో మేళవింపు చేసిన మన్సూర్ సమకాలీన పాలస్తీనా కళారంగ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1947లో రమల్లాకు సమీపంలోని బిర్జెట్లో జన్మించిన మన్సూర్, ముప్పును ఎదుర్కొంటున్న పాలస్తీనియన్ల అస్తిత్వాన్ని పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న తరంలో భాగంగా 1970ల్లో పేరు ప్రతిష్టలు గడించారు.
సిపిఎం నేత బేబీ సంతాపం
మన్సూర్ మృతి కళా రంగానికి తీరని లోటని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ సంతాపం వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలకు తమ భూభాగంతో వున్న విడదీయలేని బంధాన్ని ఇంతిఫాదా కళాకారుడైన మన్సూర్ చిత్రాలు, శిల్పాలు అత్యంత ప్రతిభావంతంగా వివరించాయి. పాలస్తీనియన్ల స్మృతులను, గుర్తింపును, విముక్తి పోరాటాలను అత్యంత శక్తివంతంగా చిత్రీకరించారని బేబీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. పాలస్తీనా కళారంగ, సాంస్కృతిక చరిత్రకు సంబంధించినంతవరకు మన్సూర్ మరణంతో ఒక శకం ముగిసిందని అన్నారు. పాలస్తీనియన్ల చరిత్రకు, వారి అచంచలమైన ధైర్య సాహసాలకు దృశ్యరూప సాక్ష్యంగా ఆయన కళారూపాలు చిరకాలం నిలిచిపోతాయని బేబీ పేర్కొన్నారు. ప్రగతిశీల ప్రపంచంలో ముందుకు దూసుకెళ్ళడానికి కళా, సాంస్కృతిక రూపాలను ఉపయోగించుకోవాలనుకునేవారికి మన్సూర్ స్ఫూర్తిని రగిలిస్తునే వుంటారని బేబీ పేర్కొన్నారు.







కామెంట్లు (0)