ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌ చేరుకున్న రష్యా అధ్యక్ష‍ుడు పుతిన్‌

1 రోజు క్రితం

Putin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 12:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం భారత్‌ చేరుకున్నారు. ఆయన మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనడంతో పాటు ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యలు ప్రారంభించిన అనంతరం రష్యా వెలుపల జరగనున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్‌ స్వయంగా పాల్గొనడం ఇదే మొదటిసారి. పుతిన్‌ వెంట ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా భారత్‌కు చేరుకుంది. శనివారం నుండి రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్‌ సదస్సులో ఆహారం, ఇంధనం, ఆరోగ్యం, విపత్తుల నిర్వహణ, కీలక సరఫరా గొలుసుల వంటి రంగాల్లో సభ్య దేశాల మధ్య సహకారం, సామూహిక స్థితిస్థాపకతను పెంపొందించడంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బ్రిక్స్‌ను మరింత సమర్థవంతమైన వేదికగా బలోపేతం చేయాలని భారత్‌ భావిస్తోంది.


పుతిన్‌కు విమానాశ్రయంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కె.వి. సింగ్‌ స్వాగతం పలికారు. భారత్‌-రష్యా సంబంధాలు ప్రత్యేకమైన, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆధారపడి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. పుతిన్‌, మోడీ శుక్రవారం విస్తృత ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, పెట్టుబడులు, వాణిజ్యం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చించే అవకాశం ఉందని పేర్కొంది. బ్రహ్మోస్‌ క్షిపణి ఆధునీకరణ, మిగిలిన ఎస్‌-400 వ్యవస్థల సరఫరా పూర్తి చేయడం, ఎస్‌యూ-57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరా వంటి రక్షణ రంగ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. భారత్‌లో కొత్త పౌర అణు రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరుదేశాలు చర్చించనున్నట్లు రష్యా వెల్లడించింది. ఇంధన రంగంలో ఇప్పటికే ఉన్న సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపైనా దృష్టి సారించనున్నాయి. ఇటీవల బిష్కెక్‌లో జరిగిన ఎస్‌సిఒ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ, పుతిన్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్