- పూనెలో ఎంపిఎస్సి అభ్యర్ధుల భారీ నిరసన ప్రదర్శన
- పరీక్షలో అక్రమాలపై ఆగ్రహం
- రాజకీయ నాయకుల పాత్రపై విచారించాలి : సిజెపి
పూనె : మహారాష్ట్రలో పరిక్షల అక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్దులు రోడ్డెక్కారు. సోమవారం ‘విద్యార్థి ఆక్రోశ్ మోర్చా’ పేరుతో మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిఎస్సి) అభ్యర్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పరిపాలనా వ్యవస్థలో జవాబుదారితనం ఉండాల్సిందేనని నినదించారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత వుండాలని, వివిధ పరీక్షల్లో పేపర్ లీక్లకు, అవకతవకలకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంపిఎస్సి చైర్మన్, కార్యదర్శి తక్షణమే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆ పదవుల్లో ఎలాంటి ఆరోపణలు లేని అధికారులను వెంటనే నియమించాలని కోరారు. ఓంకారేశ్వర్ టెంపుల్ చౌక్ వద్ద ప్రారంభమైన ప్రదర్శన పూనే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సాగింది. ఎంపిఎస్సి పనితీరుపై, పరీక్షల పద్దతులపై ఆందోళనకారులు నినాదాలు చేశారు. వారి డిమాండ్లకు మద్దతిస్తూ ఎన్సిపి (ఎస్పి) ఎంఎల్ఎ రోహిత్ పవార్, కాంగ్రెస్ ఎంఎల్ఎ విశ్వజిత్ కాదమ్లు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. 2025 స్టేట్ సర్వీసెస్ మెయిన్ పరీక్షకు, అగ్రికల్చర్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన పరీక్షా పత్రాల మూల్యాంకనలో అనేక తప్పులు దొర్లాయని వాటిపై విచారణకు ఆదేశించాలని అభ్యర్ధులు కోరుతున్నారు. మార్చిలో జరిగిన డ్రగ్ ఇనస్పెక్టర్ (గ్రూపు-బి) పరీక్షకు సంబంధించి తలెత్తిన అభ్యంతరాలపై 8 రోజుల్లోగా కమిషన్ వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించి ముంబయి క్రైం బ్రాంచి, ఎంపిఎస్సికి అందించిన ప్రాధమిక విచారణా నివేదికను బహిర్గతం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. క్లర్కులు, టైపిస్ట్లకు సంబంధించి నిర్వహించే గ్రూపు సి ప్రాధమిక పరీక్ష అక్టోబరు 25న జరగాల్సి వుందని, దీన్ని పూర్తి పారదర్శక రీతిలో నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. స్టెనోగ్రాఫర్ పోస్టును పునరుద్ధరించాలని కూడా వారు కోరుతున్నారు.
ఎంపిఎస్సి అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిందే..
ఎంపిఎస్సి అధ్యక్షుడు, కార్యదర్శి వెంటనే రాజీనామా చేయాలని, వారి స్థానంలో బాధ్యత గల అధికారులను నియమించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-బి పరీక్షలోని అభ్యంతరాలపై 8 రోజుల్లోగా స్పష్టతనిచ్చి, జరిగిన అక్రమాలపై సమగ్ర విచారించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన పొరపాట్లపై విచారణ చేపట్టాలని కోరారు. పోలీసులు సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికను వెంటనే బహిరంగపరచాలని, అరెస్టయిన నిందితుడు, సంయుక్త కార్యదర్శి అభిజీత్ లెండే పదవీకాలంలో నిర్వహించిన అన్ని పరీక్షలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని పేర్కొన్నారు. సిజెపి మద్దతు ఎంపిఎస్సి పరీక్ష అవకతవకలను నిరసిస్తూ విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ ( సిజెపి) మద్దతు ప్రకటించింది. మహారాష్ట్ర విద్యార్థులకు సిజెపి అండగా నిలుస్తుందని సిజెపి వ్యవస్థాపకుడు, చీఫ్ అభిజిత్ దీప్కే సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇక ఎంపిఎస్సి పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులు పాత్రపై సమగ్ర విచారణ జరగాలని అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు.






కామెంట్లు (0)