న్యూఢిల్లీ : ‘ఇండస్ట్రీ’ నిర్వచనంపై సుప్రీంకోర్టు గురువారం స్పష్టత నిచ్చింది. పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 2(జె) కింద ‘ఇండస్ట్రీ’కి ఇచ్చిన విస్తృత నిర్వచనం, 2020 పారిశ్రామిక సంబంధాల కోడ్ (ఐఆర్సీ)లోని ‘ఇండస్ట్రీ’ నిర్వచనాన్ని అర్థం చేసుకోవడానికి ఆధారం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే, 2020 కోడ్ అమల్లోకి రాకముందు 1947 చట్టం కింద పెండింగ్లో ఉన్న పారిశ్రామిక వివాదాలకు 1978లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ‘బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ వర్సెస్ ఆర్. రాజప్ప’ కేసులో 1978లో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ‘ఇండస్ట్రీ’కి విస్తృత నిర్వచనం ఇచ్చింది. అప్పటి జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్ ప్రతిపాదించిన ‘త్రివిధ పరీక్ష’ ప్రకారం.. క్రమబద్ధమైన కార్యకలాపాలు, యజమాని-ఉద్యోగి సహకారం, ప్రజల అవసరాలను తీర్చేందుకు వస్తువులు లేదా సేవల ఉత్పత్తి వంటి అంశాలు ఉంటే ఆ సంస్థను ‘ఇండస్ట్రీ’గా పరిగణించవచ్చు. ఈ నిర్వచనం కారణంగా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, పురపాలక సంస్థలు వంటి అనేక సంస్థలు కూడా ‘ఇండస్ట్రీ’ పరిధిలోకి వచ్చాయి. అయితే న్యాయవ్యవస్థ, శాంతిభద్రతలు, రక్షణ వంటి ప్రధాన సార్వభౌమ కార్యకలాపాలను మాత్రం ఈ నిర్వచనం నుంచి మినహాయించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐఆర్సీ-2020లోని సెక్షన్ 2(పి)లో ‘ఇండస్ట్రీ’కి ఇచ్చిన నిర్వచనాన్ని 1978 నాటి తీర్పు ప్రభావితం చేయదని సుప్రీంకోర్టు మెజారిటీ అభిప్రాయం స్పష్టం చేసింది. 1947 చట్టంలోని ‘ఇండస్ట్రీ’ నిర్వచనంపై ఇచ్చిన తీర్పు, కొత్త కోడ్లోని ‘ఇండస్ట్రీ’ నిర్వచనానికి ఎలాంటి భారాన్ని లేదా ప్రభావాన్ని కలిగించదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
‘ఇండస్ట్రీ’ నిర్వచనంపై స్పష్టతనిచ్చిన సుప్రీంకోర్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 01:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)