న్యూఢిల్లీ : పెల్లెట్ గన్ల వినియోగంపై నిషేధం విధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సిజెపి నేతృత్వంలోని చేపట్టిన విద్యార్థుల ఆందోళనపై ఆర్ఎఎఫ్ వినియోగించిన ఆయుధాలకు సంబంధించిన రికార్డులను భద్రపరచాలని కేంద్రాన్ని ఆదేశించింది. నీట్ పేపర్ లీక్ను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలో పెల్లెట్ గన్ గాయాలైన ఇద్దరు బాధితులతో పాటు, మాజీ కేంద్ర సమాచార కమిషనర్, మాజీ ఐపిఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. నిరసనకారులను ఎదుర్కొనేందుకు అటువంటి ఆయుధాలను వినియోగించడం రాజ్యాంగ ప్రమాణాలకు విరుద్ధమని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద.. ప్రభుత్వ చర్యల వల్ల పెల్లెట్ గాయాలైన బాధితులకు నష్టపరిహారం మంజూరు చేయాలని, అలాగే మెరుగైన వైద్య చికిత్స, సంరక్షణ, పునరావాసం కల్పించాలని కూడా పిటిషన్లో కోరారు.
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బిపిఆర్డి) సూచనను ప్రస్తావిస్తూ.. అసాధారణ పరిస్థితుల్లో పెల్లెట్ గన్లను వినియోగించే అధికారం పోలీసులకు ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సీనియర్ న్యాయవాది వృందా గ్రోవర్ వాదనలను పరిగణనలోకి తీసుకుని, నిరసనల సమయంలో పెల్లెట్ గాయాలకు గురైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ధర్మాసనం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జులై 20న సిజెపి పిలుపునిచ్చిన నిరసనపై పెల్లెట్ గన్ల వాడకాన్ని పరిశీలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ధర్మాసనం పేర్కొంది. సమావేశాలపై భద్రతా దళాలు మితిమీరిన, ఏకపక్ష పెల్లెట్ గన్ల వాడకానికి వ్యతిరేకంగా ప్రోటోకాల్ను రూపొందించే అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణించవచ్చని సిజెఐ మౌఖికంగా వ్యాఖ్యానించారు. నిరసనల అసలు స్వరూపాన్ని దెబ్బతీయడానికి కొన్ని శక్తులు యత్నించిన కేసులు ఉన్నాయని, అటువంటి సందర్భాలలో భద్రతా దళాలు తగిన చర్యలు తీసుకోవాలని, పోలీసులకు రక్షణ పరికరాలు అందించడమే దీనికి పరిష్కారమని జస్టిస్ జోయ్మాల్య బాగ్చి పేర్కొన్నారు. పోలీసులు కూడా మనుషులేనని, ఆందోళనకారులను ఎదుర్కొనేటప్పుడు తమ భద్రతపై కూడా వారికి భరోసా ఉండాలని అన్నారు.








కామెంట్లు (0)