- ఎస్ఎఫ్ఐ నేతలు
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : నోటీసులు జారీ చేసి భయపెట్టేందుకు ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తాము లొంగబోమని ఎస్ఎఫ్ఐ నేతలు స్పష్టం చేశారు. పోరాటం కొనసాగిస్తామన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనంతరం బుధవారం నాడిక్కడ సూర్జిత్ భవన్లో ఎస్ఎఫ్ఐ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు అక్షత్ త్రిపాఠి, అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాజి, సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్, సుప్రీంకోర్టు న్యాయవాది కె ఆర్ సుభాష్ చంద్రన్ మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జంతర్మంతర్ ఆందోళనలో పాల్గొన్నందుకు ఎస్ఎఫ్ఐ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, గౌతమ్బుద్ధ యూనివర్సిటీ విద్యార్థి అక్షత్ త్రిపాఠిని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. భయపెట్టాలన్నదే యుపి పోలీసుల ఉద్దేశమైతే అది వారి పొరపాటేనని అక్షత్ అన్నారు. తనకు జారీ చేసిన నోటీసులో తాను చేసిన నేరం ఏమిటో పోలీసులు స్పష్టంగా పేర్కొనలేదన్నారు. మే నెలలోనే యూనివర్సిటీ హాస్టల్ గదిని ఖాళీ చేసి, అనంతరం కళాశాలకు వెళ్లని తనకు ఇప్పుడు నోటీసులు జారీ చేయడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. నీట్ అంశంపై మార్చి 12 నుంచి నమోదైన కేసులన్నింటినీ రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాజి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ జారీ చేసిన నోటీసును పోలీసులు ఇప్పటికీ ఉపసంహరించుకోలేదని న్యాయవాది కెఆర్ సుభాష్చంద్రన్ తెలిపారు. ఢిల్లీలో విద్యార్థుల నివాస సమస్యలపై పోరాడేందుకు ‘స్టూడెంట్ టెనెంట్స్ యూనియన్ ఢిల్లీ (ఎస్టియుడి)ను ఎస్ఎఫ్ఐ ప్రారంభించింది.







కామెంట్లు (0)