-మేఘాలయలో మరో 8 మంది యుడిపి ఎంఎల్ఎలు పార్టీ మారే అవకాశం!
షిల్లాంగ్: మేఘాలయ యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యుడిపి) నాయకుడు జెమినో మాత్హో శనివారం బిజెపిలో చేరారు. దీంతో ఆ ప్రాంతీయ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలలో కనీసం ఎనిమిది మంది బిజెపిలో చేరవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకవేళ అలా జరిగితే, మేఘాలయ అసెంబ్లీలో బిజెపి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. మే నెలలో యుడిపికి రాజీనామా చేసిన మాత్హో, శనివారం షిల్లాంగ్లో బిజెపిలో చేరారు. షిల్లాంగ్లో శుక్రవారం జరిగిన పార్టీ కేంద్ర కార్యవర్గ సమావేశానికి ఆరుగురు యుడిపి ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం, మరో ముగ్గురు తాము బిజెపితో చర్చలు జరుపుతున్నట్లు అంగీకరించడం గమనార్హం. పార్టీ అధ్యక్షుడు మెట్బా లింగ్డోతో సహా యుడిపి నాయకత్వం మాత్రం తమ పార్టీ శాసనసభ్యులంతా ఐక్యంగానే ఉన్నారని పేర్కొంది. యుడిపి, బిజెపి రెండూ నేషనల్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి అవసరమైన సంఖ్య కంటే రెండు సీట్లు అదనంగా, అంటే 33 మంది ఎమ్మెల్యేలను ఎన్పిపి కలిగి ఉండగా, యుడిపికి 12, బిజెపి రెండు సీట్లు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో ఎనిమిది మంది యుడిపి శాసనసభ్యులు బిజెపిలో విలీనమైతే, ఆ పార్టీ సీట్ల సంఖ్య 10కి పెరిగి, సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. మిత్రపక్షాలను స్వాహా చేసే బిజెపి ఎత్తుగడలలో భాగంగానే ఈ విలీనం చోటుచేసుకోనుందని పలువురు విమర్శిస్తున్నారు.








కామెంట్లు (0)