కొలంబో: భారత్–శ్రీలంక రెండో టెస్టు తొలి రోజు మైదానంలో ఘర్షణకు దిగిన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండోకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జరిమానా విధించింది. ఇద్దరి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక్కొక్కరికి ఒక డీమెరిట్ పాయింట్ను నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 17వ ఓవర్లో ఫెర్నాండో బౌలింగ్లో జైస్వాల్ ఔటయ్యాడు. అంతకుముందు వరుసగా మూడు ఫోర్లు బాదిన జైస్వాల్ను చివరి బంతికి ఫెర్నాండో పెవిలియన్కు పంపాడు. అనంతరం శ్రీలంక ఆటగాళ్ల సంబరాలపై జైస్వాల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరి తలలు ఒకదానికొకటి తగిలాయి. పరిస్థితి తీవ్రం కాకుండా అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ దూరంగా తీసుకెళ్లారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంది. ఇద్దరూ తమ తప్పును అంగీకరించడంతో ప్రత్యేక విచారణ అవసరం లేకుండానే శిక్షలు ఖరారయ్యాయి.








కామెంట్లు (0)