- నేడు పురుషుల జట్టు నెదర్లాండ్తో ఢీ
- ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్
ఆమ్స్టల్వీన్(నెదర్లాండ్స్): ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భారత పురుషుల, మహిళల జట్లు కీలక పోరుకు సిద్ధమయ్యాయి. పూల్ దశలో ఇరుజట్లు 2వ స్థానంలో నిలిచి రెండోదశకు చేరగా.. రెండోరౌండ్లో పటిష్ట జట్లతో అమీ తుమీ తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గురువారంతో పూల్స్ లీగ్ మ్యాచ్లు ముగియగా.. నాలుగు పూల్స్లో టాప్-2లో నిలిచిన 8జట్లు సెమీస్ రేసులో నిలిచాయి. ఆ 8జట్లను రెండు (ఇ, ఎఫ్ గ్రూపులు)గా విభజించగా.. భారత ఇరువురు జట్లకు పూల్-ఇలో చోటు దక్కింది. భారత మహిళలజట్టు ఉన్న పూల్లో ఒలింపిక్ ఛాంపియన్ నెదర్లాండ్స్, చైనా, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. రెండోరౌండ్లో భారత జట్టు ఆతిథ్య నెదర్లాండ్స్, ఆస్ర్టేలియాలతో తలపడనుంది. ప్రస్తుతం ఒక పాయింట్తో రెండోరౌండ్కు చేరిన భారత మహిళలజట్టు సెమీస్ బెర్త్ కొట్టాలంటే కనీసం ఒక మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్ను డ్రా చేసుకున్నా సరిపోతుంది. పూల్-డిలో తొలి మ్యాచ్లో చైనాను 2-2తో నిలువరించిన అమ్మాయిలు, దక్షిణాఫ్రికాపై 6-1తో రికార్డు విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్లతో గురువారం జరిగిన చివరి పూల్ మ్యాచ్ను 0-0తో డ్రా చేసుకొని రెండో స్థానంతో రెండోరౌండ్ బెర్త్ కొట్టారు. దీంతో పూల్ దశలో ఫలితాలను బట్టి రెండు మ్యాచ్లను డ్రాగా ముగించిన మహిళలజట్టుకు ఒక బోనస్ పాయింట్ లభించింది.
పూల్-ఇలో చోటు దక్కిన పురుషుల జట్టు కూడా సెమీస్కు చేరాలంటే చెమటోడ్చాల్సిందే. ఇదే గ్రూప్లో మాజీ ఛాంపియన్ అర్జెంటీనాతో పాటు ఆతిథ్య నెదర్లాండ్తో సెమీస్ బెర్త్కోసం పోటీ పడాల్సి ఉంది. ఇదే గ్రూప్లో ఇంగ్లాండ్ జట్టు ఉన్నా.. ఆ జట్టు వరుసగా మూడు విజయాలతో 3పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు నెదర్లాండ్స్ కూడా తమ గ్రూప్లో వరుసగా మూడు విజయాలతో 3పాయింట్లతో టాప్-2లో ఉన్నాయి. ఈ క్రమంలో భారత పురుషుల జట్టు సెమీస్ బెర్త్ కొట్టాలంటే రెండు మ్యాచుల్లోనూ గెలవాల్సి ఉంది. శనివారం నెదర్లాండ్స్తో, 24న అర్జెంటీనాతో తలపడనుంది. చైనా-ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన రెండో రౌండ్ పూల్-ఇ మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. దీంతో చైనా(2), ఆస్ర్టే లియా(1) 4వ స్థానంలో ఉన్నాయి.








కామెంట్లు (0)