- రాష్ట్రంలో మొత్తం 49 కేసులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కరోజే 10 నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ముగ్గురికి, ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నంలో జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున కరోనా సోకినట్లు వైద్య,ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 49కు చేరిందని వెల్లడించింది. ఇప్పటివరకు 302 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా 11 ఉన్నాయని పేర్కొంది. గుంటూరులో 9,కడప జిల్లా 8, విశాఖపట్నంలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కాకినాడ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు వెలుగుచూశాయని, మరికొన్ని జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదైందని వివరించింది. కరోనా బాధితుల్లో ప్రస్తుతం 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మరో 16 మంది ఇంటి వద్దనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది. ఇప్పటివరకు ఐదుగురు కోలుకుని డిశ్చార్జి అయ్యారని, కడప జిల్లాకు చెందిన ముగ్గురు, గుంటూరు, ఏలూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారని తెలిపింది. కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి నిఘాను పటిష్ఠం చేసినట్లు వెల్లడించింది.








కామెంట్లు (0)