ప్రజాశక్తి -రాజమహేంద్రవరం ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలో 11 తీర్మానాలకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల చట్టాలను ఉపసంహరించాలని కోరుతూ ఎపి రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి_వై గోపాల్ రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎపి రైతు సంఘం పశ్చిమగోదావరి జిల్లా నాయకులు హరే రామ్ బలపరచగా ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతుసంఘాల ఉద్యమాలతో ఉపసంహరించుకుందని, ఆ సమయంలో సంయుక్త కిసాన్ మోర్చాకు ఇచ్చిన హామీ సి2+50 ప్రకారం పంటల మద్దతు ధరలు, అమలు గ్యారెంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. పేద మధ్య రైతులకు కౌలు రైతులకు వ్యవసాయ కార్మికుల రుణాలు పూర్తిగా రద్దు చేయాలని కోరారు .మార్కెటింగ్ శాఖలను వ్యవసాయ పంటల ప్రొసెసింగ్, మార్కెటింగ్ సహకార పద్ధతిలో అభివృద్ధి కేంద్రాలుగా చేయాలన్నారు. పరపతి, పాడి, మత్స్య సహకార సంఘాలను విస్తృతపరిచి రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా, రైతుల సంస్థలుగా అభివృద్ధి పరచాలని కోరారు. ఎస్కెఎం నాయకత్వంతో చర్చించి విత్తన, ప్రకృతి వైపరిత్వాల, పంటల బీమా తదితర చట్టాలను రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఏర్పరచాలని డిమాండ్ చేశారు.
- యాప్ ద్వారా ఎరువులు అమ్మకాలు నిలుపుదల చేయ్యాలి.
- పాల రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి.
- రుణమాఫీ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయ్యాలి.
- రైతులకు ఉచిత పంటల భీమా పథకం అమలు చేయ్యాలి.
- సి2+50 సూత్రం ప్రకారం పంటల మద్దతు ధరల అమలు గ్యారెంటీ చట్టం చేయ్యాలి.
- పండ్ల తోటల రైతులు ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి.
- మామిడి పొగాకు ఉత్పత్తులను__ప్రభుత్వమే కొనాలి.
- బలవంతపు సేకరణ ఆపాలి.
- సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయ్యాలి.
- గిరిజనుల భూ సమస్యల పరిష్కరించాలి.
- ఆయిల్ పామ్, కోకో, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి.








కామెంట్లు (0)