భూమి లేని పేదల కోసం రూ.26.92 కోట్లు
సిఆర్డిఎకు విడుదల చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని అమరావతి కోసం తీసుకున్న రుణాల చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.231 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ బుధవారం జిఓ నెంబరు 967 విడుదల చేశారు. 2026-27 బడ్జెట్ అంచనాల్లో త్రైమాసిక నిబంధనల మినహాయింపు ద్వారా సిఆర్డిఎ కార్యకలాపాల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ 2వ త్రైమాసికంలో చెల్లించాల్సిన రుణ చెల్లింపుల కోసం విడుదల చేసిన ఈ నిధులను రుణాల చెల్లింపులకే ప్రత్యేకంగా ఉపయోగించాలని, ఏ అవసరాలకూ వాడకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రుణ ఒప్పందాలు గడువు తేదీల ప్రకారం చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిధుల వినియోగం పూర్తయిన వెంటనే, రుణం చెల్లింపుల వివరాలతో కూడిన యుటిలైజేషన్ సర్టిఫికెట్ను సాధరణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆదేశించారు.
రాజధాని భద్రతా నిధికి రూ.26 కోట్లు
బడ్జెట్ అంచనాలు 2026-27 ప్రకారం రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి కింద భూమిలేని పేద కుటుంబాలకు పెన్షన్ల చెల్లింపు కోసం, రూ. 26.92 కోట్లు విడుదలకు అవసరమైన పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. దీనిపై పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి కింద అర్హులైన భూమిలేని పేద లబ్ధిదారుల కోసం వినియోగించాలని సూచించారు.








కామెంట్లు (0)