- ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు రాజేంద్రప్రసాద్
- మహాధర్నాతో దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్
ప్రజాశక్తి - ఎన్టిఆర్ జిల్లా ప్రతినిధి : న్యాయవాదులకు రక్షణ చట్టం రూపొందించాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఐలు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన న్యాయవాదులు శనివారం విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చేసిన నినాదాలతో చౌక్ దద్దరిల్లింది. ధర్నాను సుంకర రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదులను పబ్లిక్ సర్వెంట్లుగా పరిగణించి రక్షణ చట్టం రూపొందించి అమలు చేయాలని కోరారు. న్యాయవాదులకు సంఘ విద్రోహశక్తులు, పోలీసులు, ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్ నుండి రక్షణ అవసరమని, కక్షిదారుల నుండి రక్షణ అవసరం లేదని అన్నారు. జూనియర్ న్యాయవాదులకు గతంలో హామీ ఇచ్చినట్లుగా నెలకు రూ.పది వేలు స్టయిఫండ్ ఇవ్వాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన న్యాయవాదులందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యనిర్వహణకు అనేక రకాలుగా సహకరిస్తూ మూలస్తంభంగా ఉన్న న్యాయవాదుల సమస్యలను విస్మరించడం సరికాదన్నారు. ఐలు రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎంఎల్ఎ దిగుబాటి రాజగోపాల్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐలు రాష్ట్ర అధ్యక్షులు కెంగర కుమార్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యురాలు ఆర్.గంగా భవానీ, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణుభొట్ల లక్ష్మీ నారాయణ, ఐలు కృష్ణా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రావి వెంకటరావు, వేము కోటేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి వేపాటి రాజారత్నం, రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, వందలాది మంది న్యాయవాదులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)