ప్రజాశక్తి -ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని కోక్ ఓవెన్ బ్యాటరీ-1 విభాగంలో శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందారు. తోటి కార్మికులు తెలిపిన కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి అనంత బార్వే (52) ఫోస్బెల్ సంస్థకు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడిగా స్టీల్ ప్లాంట్లో పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం బ్యాటరీ-1లో విధుల నిమిత్తం వెళుతుండగా ఆయనపై ఏడు మీటర్ల ఎత్తు నుంచి ఎలక్ట్రికల్ బస్బార్ పడింది. తీవ్రంగా గాయపడిన ఆయనను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అనంత బార్వే మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులు పశ్చిమ బెంగాల్లోనే ఉంటారు.
నిర్వహణ, భద్రతా లోపాల వల్లే ప్రమాదం : సిఐటియు
స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) నాయకులు జె అయోధ్యరామ్, తదితరులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. రెండేళ్లుగా వినియోగంలో లేని ఎలక్ట్రికల్ బస్బార్ను తొలగించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. యాజమాన్యం నిర్వహణ, భద్రతా చర్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్లాంట్ యాజమాన్యం కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, పనికిరాని పరికరాలను వెంటనే తొలగించి, అన్ని విభాగాల్లో సమగ్ర నిర్వహణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాజా ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)