బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ప్రభుత్వ సాయం ఆందించాలి
మందకృష్ణ డిమాండ్
ప్రజాశక్తి - తాడికొండ (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన దళిత యువకుడు చీకటి గోపి మృతికి కారణమైన తాడికొండ సిఐ, ఎస్ఐ, సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, గోపి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు సాయం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. పొన్నెకల్లు గ్రామంలోని గోపి కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మందకృష్ణ మాట్లాడుతూ పూర్తి ఆరోగ్యవంతుడైన గోపిని దొంగతనం నెపంతో తీవ్రంగా కొట్టడంతోనే ఆస్పత్రిపాలై మృతి చెందాడని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు లేకుండా గోపిని, మరో ఇద్దరిని పోలీసులు అక్రమంగా నిర్భంధించి, రెండు రోజులు చిత్రహింసలు పెట్టారని అన్నారు. పోలీసులపై హత్యానేరం కేసు, ఎస్సి, ఎస్టి యాక్ట్ కింద కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక సిఐ మీద వచ్చిన ఆరోపణకు మరో సిఐ విచారణ చేస్తారా అంటూ ప్రశ్నించారు. గోపి కేసు విచారణకు ఐపిఎస్ అధికారితో స్పెషల్ సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సి, ఎస్టిల మీద దాడులు, అవమానాలు, హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, హోంమంత్రి అనిత మరింత వేగవంతంగా స్పందించాలని సత్వరమే న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ మున్నంగి నాగరాజు మాదిగ, విశ్వనాధ్ మాదిగ, గుంటూరు జిల్లా ఇంచార్జ్ కోట దానియేలు మాదిగ పాల్గొన్నారు.








కామెంట్లు (0)