హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
ప్రజాశక్తి-అమరావతి : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండ పరిధి మొత్తాన్ని మైనింగ్ నిషేధిత ప్రాంతంగా (నో మైనింగ్ జోన్) ప్రకటిస్తూ జిఓ జారీ చేశామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది యతీంద్ర దేవ్ మంగళవారం ధర్మాసనం ముందు నివేదించారు. కొండ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపేశామన్నారు. మొత్తం మూడు మైనింగ్ లీజులు మంజూరు కాగా, ఒక కంపెనీ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా వాటిని పూర్తిగా నిలిపివేశామని, మరో రెండు మైనింగ్ లీజులకు సంబంధించి ఇప్పటి వరకు కార్యకలాపాలు ప్రారంభం కాలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మైనింగ్ లీజులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని రెండు సంస్థలకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. లీజుల రద్దుకు సంబంధించి పురోగతిని తెలియజేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాంబిల్లి మండలం పంచదార్ల కొండ వద్ద మైనింగ్ లీజు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ అప్పారాయుడుపాలెం గ్రామానికి చెందిన ఉప్పులూరి నాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.








కామెంట్లు (0)