ప్రజాశక్తి - విజయవాడ: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ మహాసభ సన్నాహకాల్లో భాగంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన శనివారం ఉదయం పది గంటలకు ‘అసమ్మతి తెలిపే హక్కుపై అణచివేత - భారత రాజ్యాంగం ఏం చెబుతోంది’ (సప్రెషన్ ఆఫ్ ది రైట్ టు డిసెంట్ అండ్ ది కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా) అనే అంశంపై సదస్సు జరుగుతుందని ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె) నాలుగో అంతస్తులో జరిగే ఈ సదస్సులో జాతీయ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, జాతీయ కోర్టు (సుప్రీంకోర్టు) మేనేజ్మెంట్ సిస్టమ్ ఫౌండర్ చైర్మన్, జాతీయ లా స్కూల్ (బెంగళూరు) మాజీ డైరెక్టర్, మాజీ వైస్ ఛాన్సలర్, రాజ్యసభ మాజీ సభ్యులు ప్రొఫెసర్ జి.మోహన్ గోపాల్ ముఖ్యవక్తగా హాజరవుతారని పేర్కొన్నారు. ఐలు జాతీయ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బికాస్ రంజన్ భట్టాచార్య, ఐలు జాతీయ ప్రధాన కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.వి.సురేంద్రనాథ్, ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎపి బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్, ఐలు జాతీయ ఉపాధ్యక్షులు కె.ఇలంగో, కొల్లి సత్యనారాయణ, ఎపి బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య, ఐలు తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.పార్థసారథి తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఐలు జాతీయ మహాసభ ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.








కామెంట్లు (0)