- సిఇఓ ఛైర్మన్ గా కలెక్టర్లు, కమిషనర్లతో కమిటీ
- సిఆర్డిఏ కార్యాలయం నుండి విధులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : 'స్వర్ణాంధ్ర 2047 విజన్' కింద అమరావతి ఆర్థిక ప్రాంత ప్రణాళికను తయారు చేయడానికి వీలుగా స్టీరింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, కార్యాచరణ కమిటీ లతో కూడిన అమరావతి ఆర్థిక ప్రాంత ప్రణాళికా బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రాంతీయ అభివృద్ధి, పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణీకరణ, లాజిస్టిక్స్, పెట్టుబడుల ప్రోత్సాహం సమగ్ర ప్రణాళికా ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి అవసరమైన చర్యలను ఈ బోర్డు తీసుకుంటుందని అందులో పేర్కొంది. ఇప్పటికే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనమిక్ రీజియన్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎఈఆర్ సిఇఓ ఛైర్ పర్సన్ గా, సిఆర్డిఏ కమిషనర్ సభ్య కార్యదర్విగా ఉండే ఈబోర్డులో అన్ని జిల్లాల కలెక్టర్లు, పట్టన స్థానిక సంస్థల, ప్రాంతీయ అభివృద్ధి సంస్థల కమిషనర్లు, సిఇఓ నియమించే ప్రత్యేక ఆహ్వానితులు సభ్యులుగా ఉంటారు. రీజియన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలతోపాటు, ఆర్థిక అంశాలనూ చర్చించి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కమిషనర్ కార్యాలయం ఈ కార్యాచరణ కమిటీకి సెక్రటేరియట్గా పనిచేస్తుందని జిఓలో పేర్కొన్నారు. అలాగే ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సిఆర్డిఏ, మచిలీపట్నం పట్టణాభివృద్ది సంస్థ, బాపట్ల, ఒంగోలు, నరసరావుపేట, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్లు కూడా సభ్యులుగా ఉంటారని జిఓలో పేర్కొన్నారు.








కామెంట్లు (0)