- అరణియార్ ప్రాజెక్టు పరిరక్షణకు వైసీపీ పోరుబాట
తిరుపతి: సాగునీటి ప్రాజెక్టుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. అరణియార్ ప్రాజెక్టు సమస్యల పరిష్కారం కోసం రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. పిచ్చాటూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా ప్రచారానికే పరిమితమవుతోందని ఎంపీ విమర్శించారు. దెబ్బతిన్న కాలువలు, గేట్లు, లాకులకు వెంటనే మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సప్లై ఛానళ్లను పూర్తిస్థాయిలో శుభ్రం చేయడంతో పాటు కుడి, ఎడమ, మధ్య కాలువల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. అరణియార్ ప్రాజెక్టు ద్వారా దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ప్రస్తుతం సుమారు 3 వేల ఎకరాలకే నీరు అందుతోందని గురుమూర్తి తెలిపారు. గేట్లు, లాకుల సమస్యలను పరిష్కరించకపోవడంతో ఆయకట్టు క్రమంగా తగ్గిపోతోందన్నారు. అరణియార్ సమస్యను రైతుల సమస్యగా భావించి వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు. ఈ నెలలో పిచ్చాటూరులో భారీ ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. కీలపూడి నుంచి అరణియార్ వరకు మహా ర్యాలీ చేపట్టి ప్రాజెక్టు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎంపీ మద్దిల గురుమూర్తి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ అరణియార్ డ్యాంను సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. ఆయకట్టు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ‘జలధార’ పేరుతో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, మరమ్మతుల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని నూకతోటి రాజేష్ ఆరోపించారు. రైతులకు వాస్తవంగా ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టును అభివృద్ధి చేసి, అరణియార్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)