- రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఛైర్పర్సన్ తేజస్వి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి రెండు రోజుల పాటు ఉండవల్లి గుహల ప్రాంగణంలో ‘ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఛైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలుగు భాషను భావితరాలకు వారసత్వంగా అందించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాన్ని రూపొందించినట్లు చెప్పారు. రెండు రోజుల పాటు సంగీత కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, సాహిత్య చర్చలు, అమ్మమ్మ కథలు, యువతతో ‘నెక్స్ట్ జెన్ తెలుగు’ చర్చలు, ప్యానెల్ చర్చలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తపాలా శాఖ సహకారంతో పూర్తిగా తెలుగులో పోస్టుకార్డులు రాసే వినూత్న కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 26న జరిగే ముగింపు సభకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తదితరులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో గుంటూరు విద్యానగర్ రింగ్ రోడ్డులో ‘అమరావతి చిత్రకళా వీధి’ పేరుతో బహిరంగ చిత్రకళా ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు తేజస్వి పొడపాటి తెలిపారు. గత ఏడాది రాజమహేంద్రవరంలో 550 మంది కళాకారులతో నిర్వహించిన కార్యక్రమాన్ని ఈసారి 800 స్టాళ్లతో మరింత విస్తృతంగా చేపడుతున్నామని చెప్పారు.








కామెంట్లు (0)