- ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించడంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారనే కారణంతో వారి భవిష్యత్తును దెబ్బతీసే విధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) చర్యలు తీసుకోవడం పూర్తిగా అప్రజాస్వామికం, అన్యాయం అని ఎస్ఎఫ్ఐ రాష్ట్రకమిటీ తెలిపింది. నల్సార్ లా యూనివర్సిటీ హైదరాబాద్కు చెందిన 2026 బ్యాచ్ న్యాయ విద్యార్థుల పట్ల బిసిఐ కక్షపూరిత చర్యలను ఖండిస్తునట్లు ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పి రామ్మోహన్, కె ప్రసన్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జారీ చేసిన ఆదేశాలు సవరించినప్పటికీ విశ్వవిద్యాలయం విసికి ఘటనపై నివేదిక ఇవ్వమని తదనంతరం చర్యలు తీసుకుంటామని తెలపడం దుర్మార్గం అని తెలిపారు. విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేయకుండా నిలిపివేయడం అత్యంత తీవ్రమైన కక్షసాధింపు చర్య పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రశ్నించే హక్కు, భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలిపే హక్కు ఉంటాయని వివరించారు. ఈ హక్కులను హరించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన సంస్థలే వారి గొంతును అణచివేసే ప్రయత్నం చేయడం ఆందోళనకరమని తెలిపారు. బిసిఐ పూర్తిస్థాయిలో ఆదేశాలను వెనక్కితీసుకోవాలని, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ చర్యను ఖండించాలని కోరారు.







కామెంట్లు (0)