- ఏకపక్ష నిర్ణయాలపై అవగాహన కల్పించేందుకు మాక్ డిబేట్
- 43 మంది జూడోలు స్వచ్ఛందంగా రక్తదానం
ప్రజాశక్తి - అనంతపురం : జూనియర్ డాక్టర్ల సమ్మెలో భాగంగా అనంతపురం సర్వజన ఆసుపత్రి వద్ద సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏపీ జూడా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో 43 మంది జూనియర్ డాక్టర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సూపర్ స్పెషాలిటీ పీజీ వైద్యులు డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్యామ్, డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ సుశాంత్ తదితరులు రక్తదానం చేసిన వారిలో ఉన్నారు. జూడాల డిమాండ్లు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీవోలు), ఏకపక్ష నిర్ణయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనంతరం మాక్ డిబేట్ నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ఒక ప్యానల్, ఏపీ జూడా తరఫున మరో ప్యానల్ ఏర్పాటు చేసి ప్రత్యక్ష చర్చ జరిగితే ఎలా ఉంటుందో చూపించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల విజయవాడలో ఆరోగ్యశాఖ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం-జూడాల వాదనలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చర్చించారు.
డాక్టర్ రిచా రెడ్డి, డాక్టర్ మృదుల్, డాక్టర్ యువ కీర్తన, డాక్టర్ తేజా రెడ్డి, డాక్టర్ యామిని తదితరులు మాక్ డిబేట్లో పాల్గొన్నారు. జీవోలపై చర్చతో పాటు ఏకపక్ష నిర్ణయాల వల్ల వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ప్రదర్శన నిర్వహించారు.
ఒకవైపు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె కొనసాగిస్తూనే మరోవైపు సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరం నిర్వహించడం ద్వారా జూనియర్ డాక్టర్లు సేవా స్ఫూర్తిని చాటారని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో యూనిట్ రక్తం పలువురి ప్రాణాలను కాపాడుతుందని, యువ వైద్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.








కామెంట్లు (0)