ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. జపాన్ ఓపెన్లో యమగుచిపై 21–17, 21–17 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించి టైటిల్ గెలుచుకున్న పివి సింధు భారత బ్యాడ్మింటన్లో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేశారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిగా వెల్లడించారు. ఒలింపిక్స్లోనూ సింధు విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సింధూను అభినందించారు.
సింధు విజయం దేశానికి గర్వకారణం
జపాన్ ఓపెన్–2026 టైటిల్ను పివి సింధు సాధించడంపట్ల క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. సింధు రాష్ట్రానికి, దేశానికి మరోసారి గర్వకారణంగా నిలిచారని మంత్రి అన్నారు. ఆమె విజయం రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో ప్రపంచ వేదికలపై భారత జెండాను రెపరెపలాడిస్తున్న సింధుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని అంతర్జాతీయ టైటిళ్లు సాధించాలని ఆకాంక్షించారు. సింధు దేశానికి మరిన్ని విజయాలు అందించాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రులు నారా లోకేష్, బిసి జనార్థన్ రెడ్డి సింధు విజయానానికి హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.








కామెంట్లు (0)