- బిజెపి నేత నోటిదురుసు వ్యాఖ్యలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్కు చెందిన బిజెపి మాజీ ఎమ్మెల్యే సంజయ్ గుప్తా ఓటర్లపై నోరుపారేసుకున్నారు. ఎవరైనా తాను తెప్పించిన నీళ్లు తాగి తనకు ఓటేయకపోతే వారి కడుపులో పురుగులు పడతాయని శాపనార్థాలు పెట్టారు. హరిద్వార్ జిల్లాలోని లక్సర్ నియోజకవర్గంలో సంజయ్ గుప్తా పుట్టినరోజు వేడుకలు ఈ నెల 20న అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి స్వామి యతీశ్వరానంద్, అఖాడా పరిషత్ అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్రపురి కూడా పాల్గొన్నారు. వీరందరి సమక్షంలోనే ఓటర్లపై సంజయ్ నోటి దురుసుతో వ్యాఖ్యలు చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి వాటర్ ట్యాంకులను నిర్మించి, ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందేలా చూశానని, ఎవరైనా తాను తెప్పించిన నీళ్లు తాగి తనకు ఓటేయకపోతే వారి కడుపులో పురుగులు పడతాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంజయ్ గుప్తా 2012లోనూ, 2017లోనూ లక్సర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన ఓటమిపాలయ్యారు.







కామెంట్లు (0)