- రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నివాళులు
- నేడు ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలకు భౌతికకాయం అప్పగింత
ప్రజాశక్తి - తిరువూరు : సిపిఎం ఎన్టిఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, తిరువూరు పట్టణ కార్యదర్శి, ఐలు జిల్లా నాయకులు మేకల నాగేంద్ర ప్రసాద్ సతీమణి, సిపిఎం సీనియర్ సభ్యులు రవికుమారి (56) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో విజయవాడ కానూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందారు. గత 36 సంవత్సరాలుగా సిపిఎం సభ్యురాలిగా ఉన్న ఆమె... తిరువూరు మండల, పట్టణ కమిటీ సభ్యురాలిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మహిళలపై వివక్ష, హక్కులు, సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేశారు. పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ మహిళలను చైతన్యపరిచేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశారు. రవికుమారి భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి తిరువూరు శాంతినగర్లోని ఆమె నివాసానికి తీసుకువచ్చారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు రవికుమారి భౌతికకాయాన్ని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలకు వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సిపిఎం, ఐలు నేతల నివాళులు
విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రం వద్ద రవికుమారి భౌతికకాయంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, వై.వెంకటేశ్వరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. రవికుమారి మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని వారు పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు బి.ఆర్.తులసీరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జై.జయరామ్, సూర్యారావు, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవరావు, సిపిఎం ఎన్టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.వి.ఆంజనేయులు, ఎన్సిహెచ్.శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు ఏ.వెంకటేశ్వరరావు, ఎన్.సిహెచ్ సుప్రజ, ఐలు జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు, వడ్లమూడి రామకృష్ణ, పి.రాజారత్నం తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.








కామెంట్లు (0)