ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా, ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశించారు. తాడేపల్లిలో ఎపి డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి బుధవారం సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి చేరేలా డిజిటల్ ప్రచారాన్ని విస్తరించాలని సూచించారు. ప్రజలకు విశ్వసనీయమైన సమాచారమందించేందుకు పోలీస్శాఖ ధ్రువీకరించిన సమాచారాన్ని ఎపిడిసితో సమన్వయం చేసుకునే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.
175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోషల్ మీడియా యూనిట్లను పూర్తిస్థాయిలో క్రియాశీలం చేసి, ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎపి డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు రాణి సుష్మిత, ఐఅండ్పిఆర్ స్పెషల్ అధికారి గల్లా శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)