రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలేటి కృష్ణయ్య
ప్రజాశక్తి-ఇంకొల్లు (బాపట్ల జిల్లా) : అమెరికాతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న వాణిజ్య ఒప్పందాల వల్లే మన రైతులు పండించే పంట ఉత్పత్తులకు ధరలు పడిపోతున్నాయని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు వలేటి కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసే అన్నదాతను ఆదుకోవాలంటే ప్రస్తుత పరిస్థితులలో దేశవ్యాప్తంగా రైతుల రుణాలు రద్దు చేయడం ఒక్కటే మార్గమని అన్నారు. బాపట్ల జిల్లా మండల కేంద్రమైన ఇంకొల్లు యుటిఎఫ్ కార్యాలయంలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాదాల అంజయ్యతో కలిసి బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికాతో చేసుకున్న ఒప్పందాలతో మొక్కజొన్న, గోధుమలు, బియ్యం, పాలు, సోయా తదితర 13 రకాల ఉత్పత్తుల దిగుమతికి జీరో టాక్స్గా ఉందని తెలిపారు. అదే మనం ఎగుమతి చేయాలంటే అమెరికాకు 18 నుంచి 25 శాతం టాక్స్ చెల్లించాల్సి ఉందన్నారు. ఇలాంటి ఒప్పందాలతో స్వదేశీ వ్యవసాయం దెబ్బతింటుందని తెలిపారు. పొగాకు కూడా గతంలో 18 శాతం జిఎస్టి చెల్లించే వాళ్లని, దానిని ప్రభుత్వం ఇప్పుడు 40 శాతం పెంచిందని పేర్కొన్నారు. దీంతో పొగాకు కంపెనీలు రైతుకు ఇచ్చే ధరలో కోత కోస్తున్నాయని, పొగాకు ధర పతనం కావడానికి ఇదొక ప్రధాన కారణమన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిన 2025 నూతన విత్తన చట్టంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. విత్తనాలు మొలకెత్తనప్పుడు, కల్తీవి అయినప్పుడు ప్రస్తుత చట్టప్రకారం పరిహారం రాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు ఇవ్వడానికి నూతనంగా ఏర్పాటు చేసిన యాప్తో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదన్నారు. ఈ యాప్ను రద్దు చేసి రైతులకు సరిపడా ఎరువులను అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)