- విద్యుత్ ఉద్యోగుల జెఎసి
- జెన్కో ఎండి, ట్రాన్స్కో జెఎండిలకు వినతిపత్రం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎపి రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(ఎపిఎస్పిఇ జెఎసి) కోరింది. ఈ మేరకు జెన్కో ఎండి ఎస్ నాగలక్ష్మీ, ట్రాన్స్కో జెఎండి సూర్యసాయి ప్రవీణ్ చంద్లను విద్యుత్ సౌదలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సిన నూతన పిఆర్సి అమలు చేయాల్సి ఉందని, కాబట్టి వెంటనే "ఇన్-హౌస్ పే రివిజన్ నెగోషియేషన్ కమిటీ"ని ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న పాత నాలుగు డిఎ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. 2004 ఆగస్టు 31వ తేదిలోపు నియమితులైన ఉద్యోగులకు జిపిఎఫ్ , 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ వర్తింపచేయాలని కోరారు. ఇప్పటి వరకు 629 ఎఇఇ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని, ప్రారంభ కేడర్లు జెఇ,జెఎఓ,జెఎ, జెఎల్ఎం,జెపిటిఎ వంటి పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. గ్రూప్ మెడిక్లెయిమ్ ఇపిఎఫ్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా వర్తింపచేయాలని తెలిపారు. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసినజెఎల్ఎం గ్రేడ్-2లను జెఎల్ఎంగా మార్చాలని కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని, సాంకేతిక అర్హత ఉన్న వారిని జెఇగా రీ డిజిగ్నేట్ చేయాలని కోరారు. ఒప్పంద, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరారు. జెఎల్ఎం డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఐటిఐ మార్కులు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా కారుణ్య నియామకం చేపట్టాలని కోరారు. ఈ అంశాలపై చర్చించేందుకు జెఎసి ప్రతినిధులతో యాజమాన్యం చర్చించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెఎసి చైర్మన్ విఎస్ఆర్కె గణపతి, కన్వీనర్ ఎంవి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)